స్వామీజీ చెప్పేశారు.. ఏపీ రాజధానిగా విశాఖ ఆరోజు నుంచే..ముహూర్తం ఫిక్స్..!
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు..విశాఖ నుండి పరిపాలన మరోసారి తెర మీదకు వచ్చింది. మే నెలలోనే ముందుగా రాజధాని తరలింపు కార్యక్రమం చేపట్టాలని భావించిన జగన్ సర్కార్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆలోచన వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మూడు రాజధానుల బిల్లులపైన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం పైన వివాదం తేలలేదు.అదే సమయంలో హైకోర్టులో కార్యాలయాల తరలింపు వ్యవహారం పెండింగ్ లో ఉండటంతో ఈ సందేహాలు మొదలయ్యాయి.
cool news: తెలంగాణ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు
అయితే, ఇవన్నీ సాగుతుండగానే..తాము అనుకున్న విధంగానే పరిపాలన రాజధానిగా విశాఖ ఉండాలని అక్కడ నుంచే పాలన చేయాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ముహూర్తం సైతం ఖరారు చేసారు. ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంత వరకు సాధ్యం అవు తుందనే సందేహమూ వెంటాడుతోంది.
విశాఖ నుండి పాలన..ముహూర్తం ఇదే..
ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నా..మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం మరో మూడు నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించటం లేదు. కార్యాలయాల తరలింపు వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. అయినా..సాంకేతికంగా..న్యాయ పరంగా కొత్త పరిష్కార మార్గాలు ముఖ్యమంత్రి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్ చేసిన విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర చెప్పడం విశేషం.
ముహూర్తం ఫిక్స్ చేసిన స్వరూపానందేంద్ర స్వామి
ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించేందుకు అక్టోబర్ 25 విజయదశమి రోజున ముహూర్తం ఫిక్స్ చేసినట్లు శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం అక్టోబర్ 25వ తేదీన దశమి తిథి ఉదయం 7గంటల 41 నిమిషాలకు ప్రారంభమవుతుందని ఇది మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం 9 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఇక అంతకుముందు విశాఖకు రాజధాని తరలింపును మే 28 నాటికి షిఫ్ట్ చేయాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ఆలోచనను జగన్ సర్కార్ విరమించుకుంది. సెప్టెంబర్ నెల వరకు మంచి రోజులు లేవని తాను సీఎం జగన్కు చెప్పినట్లు స్వరూపానందేంద్ర స్వామి ఆ పత్రికకు చెప్పారు. అందుకే అక్టోబర్ 25న రాజధాని తరలింపు కార్యక్రమం పెట్టుకోవాల్సిందిగా సూచించినట్లు స్వామీజీ చెప్పారు. అప్పటికల్లా అన్ని సమస్యలు సమిసిపోతాయని కూడా స్వామీజీ చెప్పినట్లు చెప్పారు.
ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వామీజీ అంటే గౌరవం
ఇక స్వరూపానందేంద్ర స్వామీజీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంతో గౌరవం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం కోసం అటు కేసీఆర్ ఇటు జగన్లకు స్వరూపానందేంద్ర స్వామే ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు స్వామీజీని కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు కూడా. ఇక సింహాచలం దేవస్థానం రెవిన్యూ శాఖల మధ్య 11వేల ఎకరాల భూమికి సంబంధించి వివాదంగా ఉందని అది కూడా సమిసిపోతుందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. ఈ భూమికి సంబంధించి ఎన్నికలకు ముందు రెండు పార్టీలు అంటే టీడీపీ, వైసీపీలు ప్రచారంలో ప్రస్తావించినప్పటికీ ఆ హామీ మాత్రం నేరవేర్చలేకపోయారు.
Recommended Video
గ్రేహౌండ్స్ కాంపౌండ్లో రాజధాని ఏర్పాటు..?
ఇక సింహాచలం దేవస్థానంకు సంబంధించిన ఆలయ భూములపై స్వరూపానందేంద్ర స్వామితో పాటు రాష్ట్రంలోని మరో ఐదుగురు స్వామీజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ భూములను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్లో కోరడం జరిగింది. సింహాచలం ఆలయ భూములకు సంబంధించి ప్రత్యామ్నాయంగా నర్సీపట్నం అనకాపల్లిలో రూ.1600 కోట్లు విలువ చేసే భూములను గుర్తించినట్లు స్వామీజీ చెప్పారు. ఇక రాజధాని విషయానికొస్తే ముందుగా ప్రచారంలో ఉన్నట్లుగా మిలీనియం టవర్లలో కాకుండా గ్రేహైండ్స్ కాంపౌండ్లో ఉంటుందని సమాచారం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఇప్పటికే చెప్పింది. ఉద్యోగస్తుల పిల్లల స్కూళ్ల విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఖండించిన శారదాపీఠం
ఇదిలా ఉంటే విశాఖ రాజధాని తరలింపుపై శారదా పీఠం క్లారిటీ ఇచ్చింది. ఆ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తున్నట్లు ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేసింది. రాజధాని తరింపునకు అక్టోబర్ 25న స్వామి స్వరూపానందేంద్ర ముహూర్తం ఖరారు చేసినట్లు వచ్చిన వార్త అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది. రాజధాని తరలింపు వ్యవహారంకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో శారదా పీఠం ఎలాంటి సంప్రదింపులు జరపలేదని చెబుతూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.