కేశినేనిని పిచ్చి తుగ్గక్ అన్న స్వామిజీ, బ్రతికుండగా గెలవలేవ్ అని శాపనార్థం
విజయవాడ : నగర విస్తరణలో భాగంగా హిందూ దేవాలయాల కూల్చివేతకు పాల్పడ్డ ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి పీఠాధిపతుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటికే ఒకరిద్దరు పీఠాధిపతులు చంద్రబాబు ప్రభుత్వానికి గండం తప్పదంటూ శాపనార్థాలు పెట్టగా, తాజాగా శివస్వామి అనే మరో స్వామిజీ టీడీపీ ఎంపీ కేశినేని నానిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
గుళ్ల కూల్చివేతను నిరసిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యమైన పీఠాధిపతులంతా, సోమవారం నాడు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు స్వామిజీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టగా, అందులో శివస్వామి అనే ఓ స్వామిజీ ఎంపీ కేశినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆ స్వామిజీ మాట్లాడుతూ.. తమదీ విజయవాడనే అని, తమ తల్లిదండ్రులు, తమ మేనమామలందరు స్వాతంత్ర సమరయోధులేనని చెప్పారు. ఆ సమయంలో వారంతా జైలుకు వెళ్లొచ్చినా ఒక్క గజం కూడా ఇప్పటికీ తమ పేరున లేదని, అంతేకాదు దైవ క్షేత్రంలోను తమకు ఎటువంటి ఆస్తులూ లేవని తేల్చి చెప్పారు.
ఆఖరికి తన పేరున కూడా తన బ్యాంకు ఖాతాలో రూ.3వేల రూపాయిలు మినహా మరే ఇతర ఆస్తులు లేవని వెల్లడించారు. ఇంత నిక్కచ్చిగా, దివ్యంగా క్షేత్ర నిర్మాణం కోసం శ్రమిస్తుంటే, దొంగ స్వామిలా ఉండి దేవాలయాల గురించి మాట్లాడతావా..? అంటూ కేశినేని 'పిచ్చితుగ్లక్' లా మాటలు తూలడం ఎంత వరకు సమర్థనీయం అంటూ ప్రశ్నించారు.
దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు కేశినేనికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అర్హత కూడా లేదని మండిపడ్డారు. ఒక పీఠాధిపతిని, స్వామిజీని పట్టుకుని విమర్శించే ధైర్యం, తెగువ మీకు ఎక్కడినుంచి వచ్చిందని నిలదీశారు.
తన వ్యాఖ్యల్లో మరింత ఘాటు పెంచిన స్వామిజీ.. 'దొంగమార్గాల్లో డబ్బు సంపాదించి ఆ ధనానంతా వెదజల్లి ఎంపీ అయిన నువ్వా మమ్మల్ని విమర్శించేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ కు రూ.500 గా ఉన్న టికెట్ ను, తన ప్రైవేటు సర్వీసుల ద్వారా వెయ్యి, రెండు వేలకు అమ్ముకుంటూ అక్రమ మార్గాల్లో డబ్బును కూడగట్టాడంటూ కేశినిపై ఆరోపణలు గుప్పించారు.
కేశినేని అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి ఎంపీ అయితే, తామంతా కాషాయం ధరించి త్యాగానికి చిహ్నంగా మారిన విషయాన్ని ఆయన తెలుసుకోవాలని సూచించారు. తనకు ఆదివారం నుంచే ఫోన్ కాల్ బెదిరింపులు వస్తున్నాయని చెప్పొకొచ్చిన స్వామిజీ.. విజయవాడలో 'నిన్ను తిరగనివ్వకుండా చేస్తాం' అంటూ పలువురు తనపై బెదిరింపులకు పాల్పడ్డట్టుగా తెలిపారు.
ఏ దాడులకు దిగినా సరే, తాను ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని అన్న స్వామిజీ, 'బ్రతికుండా నువ్వు ఒక్క సీటు కూడా గెలవలేవ్.. ఇక ఎంపీగా కూడా కొనసాగని పరిస్థితులు వస్తాయి' అంటూ శపించారు.
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. గుళ్లను కూల్చేయడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తమ గుండెలు సైతం బద్దలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు స్వామిజీ. మసీదులను తొలగించడానికి 4 నెలల సమయం ఇచ్చిన ప్రభుత్వం హిందూ దేవాలయాలకి మాత్రం కనీసం 4 రోజుల గడువు కూడా ఇవ్వలేకపోయిందని వాపోయారు.
తమ పూజల ద్వారా ప్రాణ ప్రతిష్ట చేసిన ఆలయాలను దారుణంగా కూల్చేశారని అసహనం వ్యక్తం చేసిన స్వామిజీ, ఇకనుంచి ప్రభుత్వం ఏ గుడిని తొలగించాలనుకున్నా ధర్మరక్షిత: సమితికి సమాచారం ఇచ్చి..తగు మూల్యం చెల్లించిన మీదటే ప్రత్యక్ష చర్యలకు దిగాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.