నేను చప్రాసీ నుండి: స్వామిగౌడ్, నీటి విడుదలపై లేఖ
హైదరాబాద్: చప్రాసీగా ఉద్యోగం చేసిన తనను శాసన మండలి ఛైర్మన్గా చేసిన ఘనత ప్రజాస్వామ్యానిదేనని స్వామి గౌడ్ బుధవారం ఉద్వేగంతో అన్నారు. ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నానని... ఆనందబాష్పాలు వస్తున్నాయన్నారు. మండలి సమావేశాలు హుందాగా జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.
తనకు అన్ని పార్టీల సహకారం కావాలన్నారు. రాజకీయాల్లో తానింకా పసి బాలుడినేనని చెప్పారు. మండలిలో నేను, మీరు అనే పదాలను మరచిపోదామని... అందరం కలసి ముందుకు సాగుదామని హితవు పలికారు. కాగా, మండలి చైర్మన్గా ఉదయం స్వామిగౌడ్ ఎన్నికైన విషయం తెలిసిందే.
నిబంధనల మేరకే ఛైర్మన్ ఎన్నిక: హరీష్
నిబంధనల ప్రకారమే తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక జరిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని జూన్ 29వ తేదీన సభ్యులకు పంపినట్లు చెప్పారు. బ్యాలెట్ ప్రకారం ఎన్నిక జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి ఛైర్మన్ పదవిని అలంకరించినందుకు సంతోషించాలన్నారు. మండలి ప్రొసీజరును కూడా కొందరు వక్రీకరించేందుకు ప్రయత్నం చేశారన్నారు.
కృష్ణా బోర్డుకు టీ ప్రభుత్వం లేఖ
కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది. నీటి విడుదల పైన తన అభ్యంతరాన్ని తెలిపింది. తమను సంప్రదించకుండానే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. నల్గొండ జిల్లాకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరింది. కాగా, ఇరు రాష్ట్రాల సిఎస్లకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో బోర్డు సమావేశం కానుంది. కృష్ణా బోర్డుకు లేఖ రాసిన అంశంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... కృష్ణా డెల్టాకు నీటి విడుదల సరికాదని చెప్పారు. గతంలో నీరు అక్కడకు చేరేందుకు నాలుగు రోజులు పట్టేదని, ఇప్పుడు మరో రెండు రోజులు ఎక్కువ పడుతుందన్నారు.