ఇటు అనంతపురం.. అటు ఆదిలాబాద్: తెలుగు రాష్ట్రాల్లో దాడిచేసేందుకు వస్తున్న మిడతల దండు
ఓ వైపు దేశాన్ని కరోనావైరస్ పీడిస్తుంటే ఇది చాలదన్నట్లుగా మరో గండం మిడతల రూపంలో దేశంపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉత్తరాది దేశాల్లోకి ప్రవేశించిన ఈ మిడతల దండు అక్కడ పంటలను నాశనం చేశాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ మిడతల బెడద తీవ్రంగా ఉంది. అక్కడ పంటను నాశనం చేయడంతో అక్కడి రైతన్న దిగాలుగా ఉన్నాడు. ఇక ఈ మిడతలు తెలుగు రాష్ట్రాలను కూడా గడగడలాడించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Recommended Video
తెలుగు రాష్ట్రాలను కరోనావైరస్ కమ్మేస్తున్న వేళ మరో గండం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు పొంచి ఉంది. మహారాష్ట్రలో పంటను నాశనం చేసిన మిడతల దండు అక్కడ నుంచి సరిహద్దుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు కేవలం 150 కిలో మీటర్లు దూరంలో మాత్రమే ఉన్నాయి. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించేందుకు ఈ మిడతలు రెడీగా ఉన్నాయి. ఏక్షణమైనా జిల్లాలోకి ప్రవేశించి పంటలపై ప్రతాపం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే తాము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామంటూ కలెక్టర్ దేవసేన చెప్పారు. ప్రస్తుతం పెద్దగా పంటలు లేనందున అంత కంగారు పడాల్సిన అవసరం లేదన్న దేవసేన... ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టం చాలావరకు తగ్గించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మిడతల రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే సమాచారం ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులను సీఎం కేసీఆర్ అలర్ట్ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మిడతల దాడి ఇప్పటికే ప్రారంభమైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం దాసప్పరోడ్డులో ఉన్న చెట్లపై మిడతలు దాడి చేశాయి. క్షణాల్లో ఓ చెట్టును ధ్వంసం చేసేశాయి. ప్రస్తుతం ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిడతల దండు విరుచుకుపడుతుండటంతో రాయదుర్గం ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో కూడా ఈ మిడతలు ప్రవేశించినట్లు సమాచారం. కసింకోట మండలం గోకివాని పాలెంలో మిడతలు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. జీడిమామిడి తోటల్లో ఈ మిడతలు దాడి చేసి పంటను ధ్వంసం చేసినట్లు సమాచారం.
ఏది ఏమైనప్పటికీ దేశంను వరుస కష్టాలు పలకరిస్తుండటంతో అటు అధికారుల్లో ఇటు ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మిడతలపై పోరు చేసేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి.