సాయిబాబా దేవుడెలా అయ్యారు?: స్వరూపానంద ప్రశ్నలు, నిరసనలు
ప్రకాశం: షిర్డీ సాయిబాబా దేవుడా? కాదా? అనే అంశంపై మరోసారి చర్చకు దారితీసేలా చేశారు ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మహరాజ్. అంతేగాక, సాయిబాబా దేవుడెలా అవుతారని మహరాజ్ ప్రశ్నించారు. మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన ఆధ్యాత్మిక సభలో ఆయన మాట్లాడారు.
ఎటువంటి శాస్త్ర ప్రమాణాలు లేకుండా బాబాను దేవుడిగా ఎలా పూజిస్తారని ప్రశ్నించారు. సాయి చిత్రపటాలను చూపిస్తూ ఆయన విమర్శలు చేశారు. సాయికృష్ణ, సాయిరామ్ అంటూ హిందూ దేవుళ్లతో కలిపి ఎలా ఆరాధిస్తారు?, సాయి మందిరాలలో హిందూ దేవతలను ఎలా ప్రతిష్ఠిస్తారని అన్నారు.
సాయిచాలీసా, సాయిగీత అంటూ ప్రచారం చేయడాన్ని ఆక్షేపించారు. రామజన్మభూమి, తలాక్ అంశాలను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. విమర్శలు చేశారు. అంతేగాక,'మదరసా, మిషనరీ పాఠశాలల్లో ఖురాన్, బైబిల్ బోధిస్తున్నారు.. ఏ విద్యాసంస్థలో హిందూ ధర్మాన్ని నేర్పుతున్నారు'ని ఆయన నిలదీశారు.
సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వరూపానంద అన్నారు. ఇది ఇలా ఉండగా, ద్వారకా పీఠాధిపతి ప్రసంగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న సాయిబాబా భక్తులు నిరసన వ్యక్తం చేశారు. జై సాయిరామ్ అంటూ పీఠాధిపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుర్చీలను చిందరవందర చేశారు. దీంతో పోలీసులు వచ్చి వారిని బయటకు పంపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది.