దుర్గ గుడి ఘటన: స్వరూపానంద ఆగ్రహం, ఎవరేమన్నారంటే..?
అమరావతి/విశాఖపట్నం: విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఈ విషయమై చర్చించేందుకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు భేటీ అయ్యారు.
అంతకుముందు మీడియాతో మాణిక్యాల రావు మాట్లాడుతూ.. దుర్గగుడిలో జరిగిన ఘటనపై నలభై ఎనిమిది గంటల్లోగా తమకు నివేదిక వస్తుందని, దీని ఆధారంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఏ స్థాయి వ్యక్తి ఉన్నా వదలిపెట్టమని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
Recommended Video
అలాంటిదేం లేదు.. చర్యలు తీసుకుంటాం
దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు జరిగే ఆస్కారమే లేదని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. అంతరాలయాన్ని శుద్ధి చేయడం.. అలంకరణ వరకే జరిగిందని ఆయన తెలిపారు. బయట వ్యక్తులు ఆలయంలోకి రావడం అభ్యంతరకరమే అని అన్నారాయన. రాష్ట్రపతి భార్య వస్తున్నారని.. అమ్మవారిని సుందరంగా అలకరించేందుకే బయట వ్యక్తులను బద్రీనాథ్ తీసుకొచ్చారని ఆయన వివరించారు. పూర్తి స్థాయి విచారణ కోసం దేవాదాయ శాఖ తరపున నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నామని మంత్రి చెప్పారు. పోలీసుల విచారణ కూడా జరుగుతోందన్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగితే సహించమని అన్నారు.
బాబుకు లేఖ, స్వరూపానంద ఆగ్రహం
విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పీఠం తరపు లేఖ రాస్తామని, త్వరలో పీఠాధిపతుల సమావేశం ఏర్పాటుచేసి దేవాలయాలపై ప్రభుత్వ తీరుపై కోర్టులో కేసు వేస్తామన్నారు. దేవాలయ వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి స్వలాభం కోసం చూస్తున్నారని, హిందూ దేవాలయ ఆదాయాలు మీద ఉన్న మక్కువ దేవుడి మీద లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు.
దురదృష్టకరం, చర్యలేవీ?
విజయవాడ దుర్గగుడిలో రెండు సంవత్సరాలుగా అనేక అపచారాలు జరుగుతున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని, దేశానికి కూడా చాలా అరిష్టమన్నారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా ఆలయంలో క్షుద్ర, తాంత్రిక పూజలు చేయడం శోచనీయమన్నారు. నిజ నిర్ధరణకు దేవాదాయ శాఖ ఎందుకు ఆదేశించలేదని స్వరూపానంద స్వామీజీ ప్రశ్నించారు. విజయవాడ దుర్గ గుడి ఈవోపై ఎన్నో ఆరోపణలు ఉన్నా ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేవాదాయ ఆదాయం పక్కకు మల్లుతోందని, అనవసర ఖర్చులతో దుర్వినియోగం అవుతోందని స్వామీజీ ఆరోపించారు. తాంత్రిక పూజల వ్యవహారంలో ప్రభుత్వం అధికారుల జోలికి వెళ్లకుండా అర్చకులను బాధ పెట్టడం సరికాదని అన్నారు.
క్షుద్రపూజలు లేవు..
కాగా, దుర్గ గుడి ఘటనపై పరిపూర్ణానంద స్వామి స్పందిస్తూ.. ‘దుర్గ గుడి ఈవోను బదిలీ చెయ్యడం అన్యాయం.. ఆ ఆలయంలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు లేవు. సరైన విచారణ జరపకుండా హుటాహుటిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సబబు? అసలు క్షుద్రపూజలు అనేవి లేవు. ఇలా పాలకమండలిపై ప్రభుత్వం అత్యుత్సాహం ఎందుకు? నిజాలు తేలేదాకా ఆగాలి కదా? నిజాయతీ గల అధికారుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే వారి ఆత్మాభిమానం దెబ్బతీసినట్లే. నిజానికి ఈ సంఘటన ఎన్నో అనుమానాలకు తావు ఇస్తోంది' అని పేర్కొన్నారు. ఓ వ్యక్తి ఒక బుట్టను లోపలికి తీసుకెళ్లి, మళ్లీ బయటకు తీసుకొస్తే క్షుద్రపూజా? అని ప్రశ్నించారు. సూర్యకుమారి దుర్గగుడిలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆమె ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తని అన్నారు. అసలు క్షుద్రపూజలు అనేవి లేవని, ఒకవేళ అవి ఉన్నవని కొందరు నమ్మితే వాటిని కేవలం శ్మశానాల్లో, ఊరి బయట మాత్రమే చేసుకుంటారని తెలిపారు. ఇది ఇలా ఉండగా, దుర్గ గుడి రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్ అంశం కూడా ఇప్పుడు వివాదంగా మారింది. విచారణ జరగకుండా ఎలా తొలగిస్తారని పాలకమండలి సభ్యులు ప్రశ్నిస్తున్నారు.