పుష్కరాల్లో అదేం పద్ధతి, ఎవరికి?: బాబుకు స్వరూపనందేద్ర ఝలక్
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరికి హారతి ఇస్తున్న తీరు అశాస్త్రీయంగా ఉందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. కాశీ, హరిద్వార్లలో గంగకు ఒడ్డు నుంచి హారతి ఇస్తుంటారని చెప్పారు.
ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి గోదావరి పైన కాళ్లు పెట్టి హారతి ఇస్తుండటం ఎక్కడి సంప్రదాయమని ప్రశ్నించారు. అసలు ఆ హారతి భక్తులకు ఇస్తున్నారా? నాయకులకు ఇస్తున్నారా? లేక గోదావరి తల్లికి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
కాగా, గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో ప్రతి రోజు గోదావరి తల్లికి హారతి ఇస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నారైలకు పవిత్ర పుష్కర జలం
ఇదిలా ఉండగా, గోదావరి పుష్కర పవిత్ర జలాన్ని వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు వారికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిస్తున్నట్లు ఆ సంస్థ ప్రచారకరత్ గజల్ శ్రీనివాస్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. పుష్కరాలకు హాజరుకాలేని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు వినియోగించుేందుకు వీలుగా వివిధ దేశాలకు పంపిస్తున్నట్లు చెప్పారు.
స్వరూపానందేంద్ర సరస్వతి ఇంకా మాట్లాడుతూ... హిందూ సంప్రదాయాలు, కట్టుబొట్టును అవహేళన చేస్తున్న శక్తులను తరిమి కొట్టేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28 వరకు రుషికేష్లో చాతుర్మాస దీక్ష సందర్భంగా దేశంలో సమృద్ధిగా వర్షాలు కురావాలని కోరుతూ వరుణ యాగం చేస్తామన్నారు.