విషయం చెప్పా, వ్యతిరేకత కాదు: బాబుపై స్వరూపానంద
విశాఖపట్నం: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై గానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గానీ తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టంచేశారు. సూర్యాస్తమయం తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తే అరిష్టమని మాత్రమే తాను చెప్పినట్లు ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు.
తన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రధాని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తానూ కోరుకున్నానని తెలియజేశారు. పీఠాధిపతులను సంప్రదించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉందని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు.
చంద్రబాబు వల్లనే వర్షాలు పడడం లేదని స్వరూపానందేంద్ర చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల తీరును తప్పు పడుతూ, వారు క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ డిమాండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో కూడా చంద్రబాబు హయాంలో పరిస్థితి ఇలాగే ఉన్నదని ఆయన అన్నారు.