కరోనా అందుకే అదుపులోకి రావడం లేదు, ఆలోపు సమసిపోతుంది: స్వరూపానందేంద్ర స్వామి
విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50వేల మంది ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మందికిపైగా కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఆ కారణంతోనే..
ఈ క్రమంలో స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. కాలసర్ప దోషం ప్రపంచాన్ని వెంటాడుతోందని, గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా అదుపులోకి రావడం లేదని అన్నారు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని, మే 5 తర్వాత ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు.
ఆందోళన అవసరం లేదు..
కరోనావైరస్ ప్రమాదకరమైనదే అయినప్పటికీ.. ఆ భగవంతుడి కృపతో అంతా తగ్గిపోతుందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. మనదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని, కరోనా గురించి ఆందోళన అవసరం లేదని అన్నారు. జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదని తెలుస్తోందని చెప్పుకొచ్చారు.
అదే మనకు రక్ష...
ప్రజలంతా భగవంతుడిని ధ్యానిస్తూ రక్షణ కోరుకోవాలని స్వరూపానందేంద్ర స్వామి పిలుపునిచ్చారు. కరోనా వంటి కష్టకాలంలో భగవంతుని నామస్మరణే భారతదేశానికి రక్ష అని అన్నారు. లాక్డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచితే సన్మార్గంలో నడుచుకుంటారని వివరించారు. కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని తెలిపారు. కాగా, విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని స్వరూపానందేంద్రస్వామి వివరించారు.
Recommended Video
ఏపీలో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు..
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం మరో 28 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 572కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 13, కృష్ణాలో 5, నెల్లూరు 6, అనంతపురం 5, గుంటూరు 4, చిత్తూరు 4, కడప జిల్లాలో ఒక్క కేసు ఉన్నాయి. కరోనాతో రాష్ట్రంలో 14 మంది మరణించగా, మరో 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.