టీడీపీపై స్వరూపానంద విమర్శలు ..ఆ నిధుల దుర్వినియోగంపై విచారణ చెయ్యాలన్న స్వామి
ఏపీ సీఎం కు అత్యంత సన్నిహితంగా వుండే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి టీడీపీ పై విమర్శలు చేశారు. గతంలో ఒక మారు చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో చంద్రబాబు పై కేసు పెడతానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ సంచలన ప్రకటన చేసారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవహారాల పై ఆయన సీరియస్ గా స్పందిచా రు.
ఏపిలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ప్రభుత్వ మార్పు కోసం రాజ శ్యామల యాగం చేస్తానని ప్రకటించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందని, దానిపై విచారణకు జగన్ ను కోరతానని చెప్పి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంతో ప్రీతిపాత్రుడైన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి టీడీపీపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు .
తాజాగా ఆయన మరోసారి టీడీపీపై విరుచుకుపడ్డారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నదీ హారతులు, పుష్కరాలు, పథకాల పేరుతో గత ప్రభుత్వ హయాంలో బోలెడంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని స్వరూపానంద విమర్శలు చేశారు . ఈ దుర్వినియోగంపై ప్రజలకు టీడీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సీఎం జగన్ ను కోరతానని స్వరూపానంద చెప్పారు.
గతంలో కూడా చంద్రబాబు పాలనను దుష్ట పాలనగా స్వరూపానంద అభివర్ణించారు. చంద్రబాబు పాలనను దుష్ట సామ్రాజ్యంగా అబివర్ణించిన ఆయన చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడేందుకే కేసీఆర్ తో జగన్ చేతులు కలిపి ఉంటారని ఒక సందర్భంలో చెప్పారు. ఓ దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చాలంటే ఎన్నో రకాల ఎత్తుగడలు వేయాల్సి ఉంటుందని, అందులో భాగంగానే కేసీఆర్ తో జగన్ కలిసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఇక తాజాగా నదీ హారతులు, పుశాకరాల సమయంలో చాలా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి మరో మారు టీడీపీని టార్గెట్ చేశారు స్వరూపానంద స్వామి.