ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంపై స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం కు అత్యంత సన్నిహితంగా వుండే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాసులు తో కలిసి కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వామి స్వరూపానంద పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న సంచలన నిర్ణయంపై స్వామి స్వరూపానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీషు లేకుంటే మన తెలుగు బిడ్డలు ఎలా జీవించాలి అని ఆయన ప్రశ్నించారు. ఇక తెలుగు భాష మనందరి మాతృభాష అని, దానిని ఎవరూ చంపలేరని స్వరూపానంద వ్యాఖ్యానించారు. పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇంగ్లీషు తప్పనిసరి అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
ఏపీలో తెలుగు మీడియం తీసివేసి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి విద్యార్థులకు విద్యా బోధన చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలుగు మాధ్యమాన్ని తీసివేయడం భాష కు ద్రోహం చేసినట్లవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు, భాషాభిమానులు. అయితే విద్యార్థుల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, వారు అన్నిరంగాల్లోనూ రాణించటానికి ప్రస్తుతం తప్పనిసరిగా భావిస్తున్న ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన సాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్వామి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.