చెన్నై పేలుళ్లు: టిసిఎస్ టెక్కీ స్వాతి అంత్యక్రియలు
గుంటూరు: తమిళనాడు రాజధాని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన ఇరవై రెండేళ్ల స్వాతి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్, అర్బన్ ఎస్పీ గోపినాథ్లతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు స్వాతి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పరుచూరి స్వాతి అంత్యక్రియలను స్థానిక వల్లూరివారి తోటలోని మహాప్రస్థానంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
స్వాతి
మధ్యాహ్నానికల్లా వస్తా, స్టేషన్కు వస్తానని చెప్పిన టిసిఎస్ టెక్కీ స్వాతి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. తమ కూతురు స్వాతి చెన్నైలో బాంబు పేలుళ్లలో మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
స్వాతి
రెండు నెలల క్రితం టిసిఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేరింది. గుంటూరుకు చెందిన స్వాతి (22) బెంగళూరు నుంచి ఇంటికి వస్తుండగా గురువారం ఉదయం బెంగుళూరు-గౌహతి ఎక్స్ప్రెస్లో సంభవించిన జంట పేలుళ్లకు బలైంది.
స్వాతి
అంతకుముందే ఆమెకు నిశ్చితార్థమైందని, మరో రెండు నెలల్లో పెళ్లి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణ వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.
స్వాతి
బెంగుళూరులో ఆమె నివాసముంటున్న రామ్సాయి పీజీ హాస్టల్ నిర్వాహకులు అనంతరామిరెడ్డి ఆమె మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.
స్వాతి
ప్రశాంతి ఎక్స్ప్రెస్లో టికెట్ దొరక్కపోతే గౌహతి ఎక్స్ప్రెస్లో తత్కాల్ ద్వారా స్వాతి టికెట్ బుక్ చేసుకుందని చెబుతూ స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తండ్రి రామకృష్ణ స్వగ్రామం జాగర్లమూడిలో వ్యవసాయం చేస్తుండగా తల్లి కామాక్షి గుంటూరులో పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఆమె తమ్ముడు ప్రద్యుమ్న ముంబైలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు.