స్వైన్ ఫ్లూ: హైద్రాబాద్లో మరో ఇద్దరు మృతి, 10మంది డాక్టర్లకు ఫ్లూ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వేన్ ఫ్లూ వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. స్వైన్ ఫ్లూతో గురువారం నాడు మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరిలో ఒకరు మహిళ, మరొకరు యువకుడు ఉన్నారు. మహిళ నిజామాబాద్కు చెందిన వారు. యువకుడు హైదరాబాదులోని మాదాపూర్ నివాసి.
ఈ నెలలో స్వైన్ ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరుకుంది. మరోవైపు, స్వైన్ ఫ్లూకు చికిత్స అందిస్తున్న పదిమంది వైద్యులకు కూడా ఆ వ్యాధి సోకింది. దీంతో ఆసుపత్రి వర్గాలు వారికి ఐదు రోజుల పాటు సెలవులు మంజూరు చేసింది. ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని సూచించింది.
వైద్యులు స్వైన్ ఫ్లూ సోకిన వారికి చికిత్స చేసేటప్పుడు నాణ్యమైన మాస్క్లు ధరించాలి. అయితే, వారు సాధారణ మాస్కులతో వైద్యం చేస్తుండటంతో స్వైన్ ఫ్లూ సోకినట్లుగా తెలుస్తోంది. వారికి ప్రభుత్వం ఆ మాస్కులు సరఫరా చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మహాత్మా గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ సోకిన వారు 43 మంది రోగులు ఉన్నారు. వారిలో పదిమంది చిన్నారులు ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య విషయంలో స్పష్టత లేదు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ స్వైన్ ఫ్లూ పైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకు స్వైన్ఫ్లూ నివారణకు హోమియో మందులు
అనంతపురం నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. పొట్టి శ్రీరాములు పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మందులు పంపిణీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వైన్ ఫ్లూ విషయమై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.