స్వైన్ ఫ్లూ: విజృంభిస్తుంది, అనంతలో కేసు నమోదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా స్వైన్ ఫ్లూ వేగంగా విజృంభిస్తుంది. తాజాగా ఆదివారం అనంతపురం జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాలోని ఉరవకొండకు చెందిన వ్యక్తికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రస్తుతం అతనికి చికిత్సను అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన వ్యక్తి తిరిగి తన సొంతూరు చేరుకున్నాడు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరిన వెంటనే అతడు అస్వస్ధతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యులు, అతడికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీంతో అతడికి హైదరాబాద్లోనే వ్యాధి సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.
ఇక విశాఖపట్నంలో కూడా వివిధ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ బారినపడిన వారు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో చికిత్స పొందుతున్న ఆమె నుంచి వైద్యులు శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపిస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన ఓ మహిళ శనివారం స్వైన్ఫ్లూతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో యూసఫ్ గూడకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం మరణించాడు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో 35 మంది స్వైన్ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా వ్యా ధి లక్షణాలతో మరో 42 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరిలో 29 మంది మరణించారు. మరో 1500 మంది స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడిన పలువురు ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.