చిత్తూరు జిల్లాలో స్వైన్ఫ్లూ కలకలం...అదేం లేదంటున్న వైద్యులు:భయాందోళనలో స్థానికులు
చిత్తూరు:జిల్లాలో స్వైన్ఫ్లూ విస్తరణపై వదంతులు చెలరేగుతుండటంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తొమ్మిదిమంది స్వైన్ఫ్లూ లక్షణాలతో స్విమ్స్లో చికిత్స పొందుతున్నారని...వారిలో ఒకరు మరణించారనే వార్తలతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు స్విమ్స్ లో స్వైన్ఫ్లూ రోగులకు చికిత్స జరుగుతున్న విషయం వాస్తవమేనని...అయితే అధికారులు వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. . అయితే అధికారికంగా మాత్రం ఆస్పత్రిలో ఎలాంటి స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాలేదని, ఎవరూ చికిత్స పొందటం లేదని అధికారులు చెబుతున్నారు. అలాగే జిల్లాలో స్వైన్ఫ్లూ భయంలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ కూడా పేర్కొనడం గమనార్హం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరును స్వైన్ ఫ్లూ భయం వణికిస్తోంది. జ్వరం అంటూ తిరుపతి స్విమ్స్లో చేరినవారిలో 9మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా వీరిలో జీడీ నెల్లూరుకు చెందిన ఒక మహిళ శనివారం చనిపోయింది. ఈ మహిళ మృతితో అప్రమత్తమైన అధికారులు మిగిలిన పేషెంట్లను ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
అంతేకాదు ఈ రోగులకు వైద్యం అందించిన ఓ డాక్టర్ కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వెలువడటం తోటి రోగుల్లో మరింత ఆందోళన పెంచింది. ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారిలో ఎక్కువమంది తిరుపతి, జీడీ నెల్లూరు, ఎస్ఆర్ పురానికి చెందినవారు ఉన్నారంటున్నారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామగిడ్డయ్య. సెప్టెంబర్ 22న రెండు కేసులు నమోదయ్యాయయని తెలిపారు. వ్యాధి విస్తరించకుండా చర్యలు ప్రారంభించామని చెప్పారు.
మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి రోజూ వేలాదిమంది శ్రీవారి దర్శనం కోసం వస్తున్న క్రమంలో...స్వైన్ ఫ్లూ వార్తల నేపథ్యంలో టీటీడీ కూడా అప్రమత్తమయ్యింది. భక్తుల్లో ఎవరికైనా స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే స్విమ్స్కు పంపించడం జరుగుతుందని టీటీడీ మెడికల్ ఆఫీసర్ నాగేశ్వరరావు చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తుల్ని ఎలాంటి భయాన్ని కలిగించదలచుకోలేదన్నారు. టీటీడీ అధికారులు, వైద్యులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
అయితే ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి విస్తరించదని వైద్యులు సూచిస్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, జలుబు,దగ్గు, జ్వరంగా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని అంటున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు, నీరు మారడం వల్ల జలుబు, దగ్గు రావడం సహజమే అన్న భావనలో చాలా మంది ఉంటారని...కానీ ఈ వ్యాధులను అంత తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇదిలావుండగా స్వైన్ఫ్లూ విషయమై సంబంధిత వైద్య అధికారులతో కలెక్టర్ ప్రద్యుమ్నటెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎవరికీ స్వైన్ ఫ్లూ లేదని, ఒకవేళ ఎవరైనా ఈ వ్యాధి బారిన పడినా తిరుపతి స్విమ్స్లో వారి చికిత్స నిమిత్తం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రత్యేకించి స్వైన్ఫ్లూపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ ప్రద్యుమ్న కోరారు.