నోట్ల రద్దు ఎఫెక్ట్ ఇలా: స్వైపింగ్ మిషన్ల బిల్లు తడిసిమోపెడు.. వ్యాపారులు లబోదిబో
నల్లధనం వెలికితీయడానికి అకస్మాత్తుగా రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ నరేంద్రమోదీ ప్రకటించారు.
హైదరాబాద్/ అమరావతి: నల్లధనం వెలికితీయడానికి గతేడాది నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి అకస్మాత్తుగా రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అవినీతికి అడ్డుకట్ట వేయడానికే తామీ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అదే సమయంలో ఆన్లైన్ లావాదేవీలతో అవినీతికి అడ్డుకట్ట వేయడంతోపాటు నల్లధనాన్ని వెలికి తీయొచ్చునని పదేపదే ప్రకటించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి దుకాణాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటుచేశారు. ఆయా వ్యాపారులతో ఏర్పాటు చేయించిన స్వైప్ మిషన్ల నిర్వహణ తీరును బ్యాంకులు, కేంద్ర ఆర్థికశాఖ, రాష్ట్ర ఆర్థిక రెవెన్యూ శాఖల అధికారులు అవగాహన కల్పించారు.
ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడిన తర్వాత బ్యాంకులు భారీగా స్వైపింగ్ మిషన్ల వినియోగంపై బిల్లులు వసూళ్లు చేయటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యాపారులు లబోదిబోమని అంటున్నారు.
స్వైపింగ్ మిషన్ల వినియోగంపై ఇలా అవగాహన
దేశమంతటా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులతో సైతం స్వైప్ మిషన్లను ఏర్పాటు చేయించారు. ప్రతి షాపు నందు స్వైప్ మిషన్ తప్పనిసరని అధికారులు ఒకటికి పదిసార్లు వ్యాపారుల వద్దకు వెళ్లి, వారితో సమావేశాలు నిర్వహించి, పదే పదే అవగాహనను కల్పించి, స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయించారు. స్వైప్ మిషన్ వాడే వ్యాపారులకు తొలి మూడు నెలలు స్వైప్ మిషన్పై ఎటువంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా పొందవచ్చునని, తరువాత నెల నుంచి ప్రతి నెలకు రూ.300 వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకర్లు, అధికారులు చెప్పారు.
ఇలా స్వైపింగ్ మిషన్లపై భారీగా చార్జీల వసూళ్లు
కానీ స్వైప్ మిషన్ ఏర్పాటు చేసుకున్న వ్యాపారుల ఖాతాల నుంచి ప్రతి నెల రూ.1150 చొప్పున స్వైప్ మిషన్ చార్జీల కింద కట్ చేసుకోవటంతోపాటు ప్రతి లావాదేవీపై ఒక శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో వ్యాపారులు లబోదిబోమని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలపై మక్కువ చూపని ప్రజలతో స్వైప్ మిషన్పై అసలు వ్యాపారం లేదని, కానీ ప్రతి నెల చార్జీలు కట్ చేస్తే, తమ పరిస్థితి ఏమిటని వ్యాపారులు వాపోతున్నారు. తమకు చెప్పిన ప్రకారం రూ.300 కట్ చేసి, మిగిలిన సొమ్ములను తిరిగి తమ ఖాతాల్లోకి మళ్లించాలని వ్యాపారులు, బ్యాంక్, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నా ఫలితం లేదు.
Recommended Video
స్వైపింగ్ మిషన్లతో ప్రతి నెలా ఇలా వసూళ్లు
కట్ అయిన చార్జీలు తిరిగి ఇవ్వటం కుదరదని, ప్రతి నెల ఇదే మాదిరిగా కట్ అవుతాయని, నచ్చితే ఉంచుకోవటం లేకుంటే తిరిగి ఇచ్చేయవచ్చునని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పటంతో వ్యాపారులు చేసేది లేక స్వైప్ మిషన్లను తిరిగి ఇచ్చేశారు. తమ వద్ద చెప్పినదానికన్న ఎక్కువ మొత్తంలో కట్ చేసిన సొమ్ములను తిరిగి ఇచ్చేలా చూడాలని వ్యాపారులు అధికారులను కోరుతున్నారు. రేషన్ తీసుకునేందుకు షాపుకు వెళ్తే ఖాతాలో సొమ్ము లేదని డీలర్ చెప్పారు. బ్యాంక్కు వెళ్లి ఆరా తీస్తే, స్వైప్ మిషన్ చార్జీలుగా ఉన్న సొమ్ము మొత్తం కట్ చేశామని, అదికాక మరో రూ.1500 బ్యాంక్కు మీరే బాకీ ఉన్నారని చెప్పారు. చెప్పకుండానే ఖాతాలో సొమ్ములు కట్ చేశారు.
ఖాతాదారులకూ సమాచారం ఇవ్వని బ్యాంకర్లు
స్వైపింగ్ మిషన్ల వినియోగానికి సర్వీస్ చార్జీలు చేసే విషయమై బ్యాంకర్లు కనీసం ఖాతాదారులకు సమాచారం కూడా ఇవ్వలేదు. స్వైప్ మిషన్తో చేసిన వ్యాపారం లేకున్నా ఉన్న సొమ్ములు కాస్త పోగుట్టుకున్నామని కట్ చేసిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ప్రారంభంలో స్వైప్ మిషన్ తీసుకునేముందు మూడు నెలల వరకు బ్యాంకులు ఉచితంగా సేవలందిస్తాయన్నారు.
తరువాత నెలకు రూ.200 నుంచి రూ.300 వరకు చార్జీలు కట్టాల్సివస్తుందని అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఒకేసారి నెలకు రూ.1150 చొప్పున కట్ చేశారు. ఇదికాక ప్రతి లావాదేవీకి 1శాతం అదనపు చార్జీలు కట్ చేశారు. ఇదేమిటంటే అలాగే కట్ అవుతాయని, ఏంచేయలేమంటున్నారని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. కట్ అయిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని కోరుతున్నామని చెప్తున్నారు.