సీఎం జగన్ తో చిరు లంచ్ భేటీ: అసలు లక్ష్యం పవన్..ఆ ప్రతిపాదన సైతం : మెగా..వైసీపీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ..
ముఖ్యమంత్రి జగన్ తో మరి కాసేపల్లో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో తాను సమావేశం కావాలని..సమయం కేటాయించాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేసి లంచ్ కు రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ రోజు మధ్నాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిలోనే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ విందు భేటీ జరగనుంది. సచివాలయం అధికారిక షెడ్యూల్ పూర్తి చేసుకొని 12.40 గంటలకు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ నుండి తన నివాసానికి బయల్దేరనున్నారు.
మధ్నాహ్నం 1.10 గంటలకు చిరంజీవి ఆయన తనయుడు రాం చరణ్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రితో జగన్ తో కలిసి లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు. మోత్తం కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యత ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి కన్నబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. చిరంజీవి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన సమయం నుండి భేటీ పూర్తయ్యే వరకూ చోటు చేసుకొనే చర్చలు..పరిణామాల పైన రాజకీయగానూ..సినీ ఇండస్ట్రీలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది.
ముఖ్యమంత్రి జగన్ తో చిరు సమావేశం..
ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రాం చరణ్ భేటీ కానున్నారు. సైరా సినిమా విడుదల తరువాత మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి సినిమాను చూడాల్సిందిగా చిరంజీవి ఆహ్వానించేందుకే వస్తున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన సీఎంఓ లో అప్పాయింట్ మెంట్ కోరారు. ఆ వెంటనే జగన్ నుండి తన ఇంటికి లంచ్ కు రావాలని ఆహ్వానం అందగా..చిరంజీవి అంగీకరించారు. ఈ సమావేశంలో సినిమా నిర్మాత రాం చరణ్ సైతం పాల్గొంటున్నారు. ఈ సమావేశం కోసం ముఖ్యమంత్రి షెడ్యూల్ లో దాదాపు గంటన్నార సమయం కేటాయించారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు..రాజకీయాలను మరిచి ఇప్పుడు ఇద్దరూ భిన్న హోదాల్లో సమావేశం కానుండటంతో అనేక అంచనాలు తెర మీదక వస్తున్నాయి.
చిరంజీవికి సన్నిహితంగా వైసీపీ అడుగులు..
చిరంజీవి గతంలో కాంగ్రెస్ లో ఉన్న సమయంలోనూ ఏనాడు జగన్ మీద ఎటువంటి విమర్శలు చేయలేదు. ఇక, ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీలో సాహో సినిమా ప్రత్యేక షోలకు అనుమతించని జగన్.. సైరా సినిమాకు మాత్రం అనుమతి ఇచ్చి తన నిర్ణయం లోని ప్రత్యేకత ఏంటో అప్పుడే స్పష్టం చేసారు. ఇక, చిరంజీవి తాడేపల్లిగూడెంలో పాల్గొన్న ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కోసం స్థానిక వైసీపీ నేతలు చిరంజీవి సమయం ఇచ్చే వరకు ఎదురు చూసారు. కార్యక్రమంలోనే అదే విధంగా చిరంజీవి సైతం వైసీపీ నేతలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో చిరంజీవి కేవలం కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరగా.. అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్ మెగాస్టార్ ను లంచ్ కు ఆహ్వానించి తాను ఆయనకు ఇస్తున్న ప్రత్యేకతను చెప్పకనే చెప్పారు.
చిరంజీవి అంగీకరిస్తే..ప్రభుత్వ పరంగా
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సినిమా పరిశ్రమ నుండి మద్దతు లభించటం లేదు. దీంతో..సినీ పరిశ్రమలో కొందరు టీడీపీకి అనుకూలంగా ఉన్న కారణంగానే జగన్ సీఎం అయినా కనీసం మా కార్యవర్గం సైతం ఇప్పుటి వరకు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు. దీంతో..ఏపీ మీద అభిమానంతో ఉండే చిరంజీవితో చర్చల సమయంలో ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఒక ప్రతిపాదన సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో సినీ పరిశ్రమను డెవలప్ చేసే బాధ్యతలను పార్టీ పరంగా కాకుండా.. ఆయన ఇష్టపడితే ప్రభుత్వ పరంగా..లేదా స్వచ్చందంగా చేసేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని సహకరాలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రతిపాదించనున్నట్లు విశ్వస నీయ సమాచారం. దీని ద్వారా సినీ పరిశ్రమలో చిరు కుటుంబం నుండే ఏపీలో ముందుగా స్టూడియోలు..పరిశ్రమ విస్తరణ కు ముందుకు వస్తే మిగిలిన వారు కదులి వస్తారని జగన్ అంచనా. దీనికి చిరంజీవి స్పందన ఆధారంగా భవిష్యత్ అడుగులు పడనున్నాయి. ఇదే సమయంలో సైరా సినిమాకు పన్ను రాయితీల మీద చర్చ జరగే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ అసలు లక్ష్యమా..
2014 నుండి జగన్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా నడుచుకుంటున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీని కోలుకోలేని దెబ్బ తీసినా.. భవిష్యత్ లోనూ తనకు ఆ పార్టీతో ఇబ్బందులు ఉండకూడదని జగన్ భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా మద్దతివ్వని చిరంజీవితో సఖ్యత ద్వారా పవన్ కు అండగా నిలుస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గం..అదే విధంగా మెగా కుటుంబాన్ని అభిమానించే వారికి సానుకూల సంకేతాలు ఇవ్వటం..వారిని మద్దతు రాజకీయంగా తన వైపు తిప్పుకోవటమే జగన్ ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇక, చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో ఆయన సేవలు ఏపీకి ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశం పైన జగన్ ఒక అంచానకు వచ్చినట్లు చెబుతున్నారు.