"సైరా" ప్రత్యేక షోల వ్యవహారం: జగన్ ప్రభుత్వంలో ఏం చర్చ జరిగింది: ఏం తేల్చారు..!
సైరా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చిత్రం. మెగా ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం. అక్టోబర్ 2. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టిన కోర్టు కేసులు సైతం సినిమాకు అడ్డు చెప్పుకుండా రూట్ క్లియర్ చేసాయి. మెగా స్టార్ కుటుంబం మొత్తం ఈ సినిమా మీద భారీ అంచనాలతో ఉంది.
సైరా సక్సెస్ కోసం : యాదాద్రిలో పూజలు చేసిన చిరంజీవి సతీమణి సురేఖ
ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ తో పాటుగా పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. దీని కోసం చిరంజీవి అనేక ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాహుబలిని మరిపించేలా ఈ సినిమా ఉంటుందంటూ మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఇంతటి భారీ సినిమాకు ప్రత్యేక షోల ప్రదర్శన విషయంలో చిత్ర నిర్మాత..దర్శకులు ఏం నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వంలో ఏం జరిగింది. చివరకు ఏం తేల్చారు. ఇది ఇప్పుడు ఈ సినిమా పైన అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో..అదే స్థాయిలో ప్రత్యేక షోల పైనా చర్చ సాగుతోంది.
సైరా ప్రత్యేక షోల పైన చర్చ...
మెగాస్టార్ చిరంజీవి నటించి..విడుదలకు సిద్దమైన సైరా నర్సింహారెడ్డిగా చిరంజీవి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల మధ్యకు వస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన తనయుడు రాం చరణ్ నిర్మాతగా ఉన్నారు. అయితే ఇంతటి భారీ సినిమా కు ప్రత్యేక షోల కోసం ఏపీ ప్రభుత్వం వద్దకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ అనుమతి కోరిందా లేదా అనేదే ఇప్పుడు చర్చ. గతంలో ప్రభాస్ నటించిన మరో సాహో సినిమా విషయంలో ప్రభుత్వం వద్దకు అభ్యర్ధన వచ్చింది. సాహో సినిమా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాహుబలి తో పాటుగా బాలక్రిష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సినిమాకు రాయితీలు ప్రకటించింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సాహో సినిమా ప్రత్యేక షోల ప్రదర్శన కోసం ప్రభుత్వం వద్దకు అభ్యర్ధన వచ్చింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఒక్క సినిమాకే అనే ఉద్దేశంతో ఇలాంటి అనుమతులు ఇస్తే..భవిష్యత్ లో మరిన్ని సినిమా లకు ఇదే రకంగా ఇవ్వాల్సి ఉంటుందని..దీని కారణంగా ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం మంత్రుల్లో వ్యక్తం అయింది. దీంతో..సాహో సినిమా నిర్మాతల ప్రత్యేక షోల ప్రదర్శన అనుమతిని ప్రభుత్వం తిరస్కరించింది.
సైనా నిర్మాతలు మత్రం..ఇలా ఎందుకంటే
ఇక..సైరా సినిమాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిరంజీవి కుటుంటం భారీగా ప్రమోషన్ చేసింది. ఇక..సినిమా రిలీజ్ సమయంలో సాధారణంగా చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ తో పాటుగా ప్రత్యేకంగా ఆసక్తిగా నిర్మించిన సినిమా కావటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో..ప్రత్యేక షోల ను ఏర్పాటు చేయాలని..ఇందు కోసం ఏపీతో పాటుగా తెలంగాణ ప్రభుత్వంలోనూ సంప్రదింపులు జరపాలని భావించారు. అయితే..సాహో సినిమా తరహాలో ఏపీ ప్రభుత్వం సైరా సినిమాకు కూడా ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరిస్తే అది ఒకింత సమస్యగా మారుతుందని అంచనా వేసారు. ప్రత్యేక షోలు లేకపోయినా సైరా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేసారు. దీంతో..ప్రభుత్వం వద్దకు వెళ్లి నో అనిపించుకోవటం కంటే.. మరింతగా పబ్లిసిటీ చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకెళ్లాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. దీంతో అసలు ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేయలేదని సమాచారం. అయితే.. సైర తెలుగులో ప్రమోషన్ అవకాశాలు మాత్రం ఎక్కువగా ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థలకే కేటాయించారు.
ఇటు ప్రభుత్వంలోనూ ఆసక్తి కర చర్చ..
ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రుల వద్ద ఈ సినిమా గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో చిరంజీవి నటించిన ఈ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్నది కావటం..అందునా రాయలసీమతో సంబంధం ఉన్నది కావటంతో దీనికి ప్రభుత్వం నుండి ప్రయోజనాలు అందేలా చూడాలని ఆ మంత్రులు అభిప్రాయ పడ్డారు. సినిమా నిర్మాతలు కోరుకొనే ప్రత్యేక షోలకు అనుమతితో పాటుగా సినిమాలో చారిత్రక నేపథ్యం ఉంటే మినిహాయింపుల పైన వారిద్దరూ చర్చించారు. దీని పైన ముఖ్యమంత్రితోనూ చర్చించాలని భావించారు. దీని ద్వారా రాజకీయంగానూ ప్రయోజనం ఉంటుందని అంచనా వేసారు. అయితే..అసలు సినిమా నిర్మాతలు ప్రభుత్వానికి ఎటువంటి దరఖాస్తు చేసుకోకపోవంతో.. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఏం చేయలేదని మంత్రులు తేల్చేసారు. దీంతో..సాహో విషయంలో ప్రభుత్వ వైఖరి తేలటంతో తాము వెళ్లి ఉపయోగం లేదని సైరా నిర్మాతలు సైతం నిర్ణయించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో కర్నూలు లో కలిసిన ఇద్దరు రాయలసీమ మంత్రుల మధ్య ఈ ఆసక్తి కర చర్చ సాగింది.