ఎపి: కేబినెట్లో నలుగురు, తెలుగింటి కోడలు.. (పిక్చర్స్)
న్యూఢిల్లీ/హైదరాబాద్: నరేంద్ర మోడీ కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి.. అందునా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కింది. బిజెపి అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నేత వెంకయ్య నాయుడు కేబినెట్లోని మొదటి ఐదుగురిలో ఒకరిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రస్తుతం ఆయన కర్ణాటక రాష్ట్రం నుంచి బిజెపి రాజ్యసభ సభ్యుడిగా పదవిలో ఉన్నారు. ఇక ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె పుట్టింది తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అయిప్పటికీ మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ పరకాల ప్రభాకర్ను వివాహమాడారు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేశారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నిర్మల ఇంటర్నేషనల్ స్టడీస్లో ఎం.ఫిల్ పట్టా పొందారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకూ బిజెపి జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
కాగా, పార్లమెంటు సభ్యత్వం లేకుండానే ఆమె కేంద్ర మంత్రి కావటం విశేషం. రాబోయే ఆరు నెలల్లో ఆమె రాజ్యసభ సభ్యురాలయ్యే అవకాశాలున్నాయి. టిడిపి సీనియర్ నేత అశోక గజపతి రాజు సైతం కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్కు కూడా కేబినెట్లో చోటు దక్కింది.
వెంకయ్య నాయుడు
బిజెపి సీనియర్ నేత వెంకయ్య. వాక్చాతుర్యం ఉంటుంది. రమణమ్మ, రంగయ్యనాయుడు దంపతులకు 1949 జూలై 1వ తేదీన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీరామపురం గ్రామంలో జన్మించారు. నెల్లూరు విఆర్సీ కళాశాలలో చదువుతుండగా ఆరెస్సెస్, రాజకీయాలు పరిచయమయ్యాయి. ఎబివిపి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో 1974లో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థి నేతగా ఎన్నికయ్యారు. ఆరెస్సెస్తో సన్నిహితంగా ఉండేవారు. ఎమర్జెన్సీలో రెండేళ్లు జైలు జీవితం గడిపారు. 1977లో అత్యయిక పరిస్థితి జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు.
ఆ మరుసటి ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1985లో ఆత్మకూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1991లో హైదరాబాద్ పార్లమెంటుకు తలపడి గట్టి పోటీ ఇచ్చారు. అవే ఆయన పోటీ చేసిన చివరి ఎన్నికలు కూడా అవే. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. 1998ల నుంచి కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బిజెపిలో జాతీయ స్థాయిలో పలు కీలక పదవులు చేపట్టారు.
వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. 2004లో జాతీయ అధ్యక్షుడి హోదాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఆడ్వానీతో పాటు సారథ్యం వహించారు. వెంకయ్య నాయుడు వయస్సు 65. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. భార్య ఉషమ్మ, కుమార్తె దీప, తనయుడు హర్షవర్ధన్. కర్నాటక నుండి రాజ్యసభలో ఉన్నారు.
నిర్మలా సీతారామన్
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వారి కోడలికి మోడీ మంత్రివర్గంలో చోటు లభించింది. విశాలాంధ్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ సతీమణి అయిన నిర్మల.. రాజకీయాల్లో మాత్రం స్వీయ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలో 1958 ఆగస్టు 18న జన్మించారు. ఢిల్లీ జెఎన్టీయులోచదువుతుండగా పరకాలతో ఏర్పడిన పరిచయం పరిణయంగా మారింది. నరసాపురంలో 1986లో అడుగుపెట్టారు.
పరకాల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కాలంలో.. చాలాకాలం పాటు ఆమె ఇంటి అవసరాలపై పూర్తి సమయం కేటాయించారు. తొలుత కాంగ్రెస్ నేతగా మొదలయి.. బిజెపిలో బాగా ఎదిగి.. చివరికి ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన పరకాల, ప్రత్యేక, సమైక్య ఉద్యమకాలంలో విశాలాంధ్ర మహాసభను స్థాపించారు. ఈ క్రమంలో భర్త రాజకీయ విశ్వాసాలను గౌరవిస్తూనే, తాను బిజెపిలో ఎదిగారు నిర్మలా సీతారామన్.
బిజెపి అధికార ప్రతినిధిగా మన్ననలు అందుకున్నారు. ఎన్డీయే హయాంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి నియమితులయ్యారు. ప్రస్తుతం అధికార ప్రతినిధిగా రాణిస్తున్నారు. మోడీకి మద్దతుగా మీడియాను కూడగట్టడంలో వ్యూహాత్మక పాత్రని పోషించారు. వాగ్ధాడి గల నాయకురాలు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నడూ లేకపోయినా, ఆమెను ఏరికోరి తన కేబినెట్లోకి తీసుకొన్నారు. నిర్మల వయస్సు 54.
అశోక గజపతి రాజు
అశోక గజపతి రాజు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. రాజ వంశీయులు. ఎన్డీయే కూటమిలో భాగంగా టిడిపికి ఒకే కేబినెట్ దక్కుతుందని అన్నప్పుడు అశోక పేరే మొదటి నుండి వినిపించింది. విజయనగరంలో1951 జూన్ 26న ఆయన జన్మించారు. ఆయన తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు.. తొలి తరం పార్లమెంటేరియన్లలో ఒకరు. అశోక్.. గ్వాలియర్లోని సింథియా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో విద్యాభ్యాసం చేశారు.
విద్యార్థి దశలో ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. జయప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో జనతా పార్టీ తరపున విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేసి విజయం సాధించారు. టిడిపి ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 1983-2009 వరకు ఒక్కసారి మినహా వరసగా ఆరు పర్యాయాలు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. అశోక వయస్సు 63. భార్య సునీల, కుమార్తె అతిథి. విజయనగరం నుండి లోకసభకు ఎన్నికయ్యారు.
ప్రకాశ్ జవదేకర్
ప్రకాశ్ జవదేకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్నారు. ఆయన 1951 జనవరి 30న జన్మించారు. వయస్సు 63. భార్య పేరు ప్రాచీ జవదేకర్. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇతను మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేశవ కృష్ణ జవదేకర్, రంజనీ జవదేకర్ దంపతులకు పుణేలో ప్రకాశ్ జవదేకర్ జన్మించారు. పుణేలో బికాం చదివారు. ఎబివిపిలో పని చేశారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పదేళ్ల పాటు పని చేశారు. 1971 నుండి 1981 వరకు ఆయన ఉద్యోగం చేశారు. ప్రకాశ్ జవదేకర్ తండ్రి హిందూ మహాసభ సీనియర్ నాయకులు. స్వాతంత్ర వీరసావర్కర్ అనుచరుడికి ప్రకాశ్ జవదేకర్ తండ్రి సన్నిహితులు.