బియాస్ ఘటనపై స్పందించాం: కెసిఆర్, ఎప్పటికప్పుడు
హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో 24మంది తెలుగు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన శనివారం అసెంబ్లీలో హిమాచల్ప్రదేశ్ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనపై తాను హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడానని తెలిపారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తమ పార్టీ ఎంపీలు అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
వారి నుంచి తాను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని చెప్పారు. హిమాచల్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు.
కాగా, హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన 24 మందిలో ఇప్పటికి 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చారు. మరో 16 మంది విద్యార్థుల కోసం భద్రతా సిబ్బంది, రెస్య్కూ టీంలు విస్తృతంగా గాలిస్తున్నాయి. గాలింపులో మానవ రహిత యంత్ర పరికరాలను కూడా అధికారులు ఉపయోగిస్తున్నారు.