ఓటింగ్ జరిగితే విధ్వంసం, ఓడిపోతామనే టి నేతలు: టిజి
హైదరాబాద్: చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో సభలో ఓటింగ్ జరిగితే విధ్వంసకాండ జరిగే అవకాశముందని, అలాంటి వారి పైన ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం సభలో తమకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఓటింగ్ జరిగితే ఓడిపోతామనే భయంతోనే తెలంగాణ ప్రాంత మంత్రులు, సభ్యులు ఒప్పుకోవడం లేదన్నారు. ఓటింగు కోసం సమైక్యవాదులు ఎదురు చూస్తున్నారన్నారు. సభలో సమైక్యాంధ్రకు 159 మంది సభ్యులు, తెలంగాణకు 119 మంది సభ్యులు అనుకూలంగా ఉన్నారన్నారు. ఓటింగులో ఓడిపోయే వారు విధ్వంసం సృష్టించే అవకాశముందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసు పైన ఓటింగ్ పెడితే ఎవరి బలం ఎంతో తెలుస్తుందన్నారు.
ఓటింగ్ జరగాలి: ఏరాసు
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభలో జరగాల్సిందేనని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఓటింగుకు తెలంగాణ ప్రాంత మంత్రులు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. ఓడిపోతారనే భయంతోనే వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
టి మంత్రులు చూసుకోవాలి: పార్థసారథి
గురువారం సభలో భద్రత పెంచాల్సిందేనని మరో మంత్రి పార్థసారథి అన్నారు. బిల్లు పైన ఓటింగ్ కోరడం ప్రతి సభ్యుడి హక్కు అన్నారు. ఓటింగ్ పెడితే సమైక్యాంధ్రకే మెజార్టీ వస్తుందని చెప్పారు. తెలంగాణకు 119 సభ్యుల బలం ఉంటే, సమైక్యాంధ్ర కోసం 159 మంది అఫిడవిట్లు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని తెలంగాణ మంత్రులు చెప్పడం విడ్డూరమన్నారు. కిరణ్ ఇచ్చిన నోటీసు రూల్ పొజిషన్లో ఉందో లేదో వారు చూసుకోవాలని హితవు పలికారు.