సోనియాగాంధీకే ఎదురా? కిరణ్ వద్దకు టి కాంగ్రెస్ నో
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా ఉందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తప్పుపట్టారు. వారు ఆదివారం సాయంత్రం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు భేటీ అయ్యారు. నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో వారు కొన్ని తీర్మానాలు చేశారు. విభజన విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడిందని కాంగ్రెసు నేతలు చెబుతున్న నేపథ్యంలో ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేయడమే కాకుండా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్న సోనియా తీరును తెలంగాణలోని గ్రామ గ్రామానికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే, వివిధ అంశాలపై ఏకాభిప్రాయానికి మాత్రం రాలేకపోయారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి కార్యాచరణ మాత్రం సిద్ధమైంది. భవిష్యత్తు కార్యాచరణపై తీవ్ర తర్జన భర్జనల తర్వాత ఈనెల 17 నుంచి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి సోనియాను అభినందిస్తూ తెలంగాణ ఏర్పాటుకు ఆమె చేసిన ప్రయత్నాలను వివరించాలని నిర్ణయించారు.
20న జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని, 22న ఢిల్లీకి వెళ్లాలని, తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధిష్ఠానం పెద్దలను కోరాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రకటన చేసిన సోనియా గాంధీని అభినందిస్తూ సభను ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై ఈ సమావేశంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. సభను ముందు హైదరాబాద్లో పెట్టాలా? ముందుగా జిల్లా స్థాయిలో నిర్వహించి తర్వాత హైదరాబాద్లో పెట్టుకోవాలా అనే అంశాన్నీ తేల్చుకోలేకపోయారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభను నిర్వహించడం మంచిదని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ విషయంలో సోనియా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పోదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో, తెలంగాణ తథ్యమని, సోనియా నాయకత్వాన్ని బలపరిచేందుకు గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని చెప్పారు.
ముఖ్యమంత్రి, సీమాంధ్ర కేంద్రమంత్రులు కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా సమావేశాలు జరపడంపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మండిపడ్డారు. ఈ చర్యలను ఖండిస్తూ వారు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లవద్దని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో సమావేశంలో తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అనే విషయము ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి ఎవరో సోనియా నిర్ణయిస్తారని, అందరూ ముఖ్యమంత్రులమనుకునే పని చేద్దామని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సూచించారు.