సినీ భాషను పక్కన పెట్టు: రోజాకు సలహా
హైదరాబాద్/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా సినిమా భాషను పక్కనపెట్టి అన్ని కులాలను గౌరవించడం నేర్చుకోవాలని తెలంగాణ దళిత సంఘం అధ్యక్షుడు గంధం రాములు హితవు పలికారు. చిత్తూరు జిల్లా పుత్తూరు శుక్రవారం ఆమె ఎస్సీఎస్టీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఆమెపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, క్షమాపణ చెప్పాలంటూ దళిత సంఘాలు రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆందోళనకు దిగారు. ఆమె దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై రాములు స్పందించారు. రోజాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. దళితులపై ఆమెకున్న గౌరవం ఏపాటిదో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆమె దళితులను కించపరిచేలా మాట్లాడారని గంధం రాములు గుర్తు చేశారు.
స్పీకర్కు లేఖ రాస్తా..
రోజా వ్యాఖ్యలపై స్పీకర్కు లేఖ రాస్తానని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అనిత చెప్పారు. శనివారంనాడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు కూడా మెమొరాండం ఇస్తామని తెలిపారు.
అట్రాసిటీ కేసుకు కాంగ్రెస్ హయాంలో విలవు లేకపోవచ్చేమో కానీ అట్రాసిటీ పవరేంటో రోజాకు టీడీపీ ప్రభుత్వం చూపిస్తుందన్నారు. దళితులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై రోజా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేశారు.