నాన్న పార్టీ మారినా నేను మారను అన్న టీజీ వెంకటేష్ తనయుడు భరత్ .. ఎందుకంటే
ఏపీలో పార్టీ ఫిరాయింపుల కలకలం రేగింది. చంద్రబాబు యూరప్ టూర్ వెళ్ళగానే రాజ్య సభ సభ్యులు నలుగురు బీజేపీలోకి జంప్ అన్నారు. టీడీపీ రాజ్యసభాపక్షాన్ని విలీనం చేశారు. ఇక ఆ బ్యాచ్ లో పార్టీ మారిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ మాత్రం తానూ పార్టీ మారనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్
తండ్రి పార్టీ ఫిరాయింపు .. కొడుకు మాత్రం పార్టీ మారనని ప్రకటన
గత రెండు రోజుల క్రితం టీజీ వెంకటేష్ , సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రాం మోహన్ రావులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే టీజీ వెంకటేష్ పార్టీ మార్పుపై ఆయన తనయుడు స్పందించారు . తన తండ్రి పార్టీ మారినా తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ తేల్చిచెప్పారు. దీంతో తండ్రి ఒక పార్టీలో, తనయుడు మరో పార్టీలో కొనసాగాలనుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తనపై ఎంతో నమ్మకంతో చంద్రబాబు ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారని ఆయనకు ఈ కష్ట కాలంలో అండగా నిలవటం అవసరం అని భావించే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చారన్న కృతజ్ఞత తోనే పార్టీ మారను అన్న టీజీ తనయుడు
ఇక టీజీ వెంకటేష్ విషయానికి వస్తే రాష్ట్రం విడిపోకముందు టీజీ వెంకటేష్.. కాంగ్రెస్ నేతగా ఉండేవారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీడి ఆయన టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీజీ ఓటమి చెందారు.ఇక ఓటమి పాలైనప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు టీజీ వెంకటేష్ ని రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత తన వారసుడిగా తనయుడు టీజీ భరత్ తో రాజకీయ అరంగేట్రం చేయించారు.మొన్న జరిగిన ఎన్నికల్లో టీజీ భరత్ కి టికెట్ కూడా టీడీపీ కేటాయించింది. అయితే.. స్వల్ప ఓట్ల తేడాతోనే భరత్ ఓడిపోయారు. తాజా రాజకీయ పరిణామాలతో టీజీ వెంకటేష్.. బీజేపీ గూటికి చేరినా టీజీ తనయుడు భరత్ మాత్రం పార్టీ మారనని టీడీపీ కే కట్టుబడి పని చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
Recommended Video
ఏ పార్టీలో ఉండాలన్నది వ్యక్తిగత నిర్ణయం అన్న తండ్రి .. టీడీపీలోనే కొనసాగుతా అంటున్న తనయుడు
ఇక ఈ విషయంపై స్పందించిన భరత్ పార్టీని వీడే ముందు నాన్న నాతో ఫోన్లో మాట్లాడారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారన్నారు భరత్. అయితే నేను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పాననీ, రాజకీయంగా అది నీ వ్యక్తిగత విషయమని నాన్న అన్నారని తెలిపారు . నాన్న బీజేపీలో చేరిన వెంటనే నేను మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఫోన్ చేసి తాను టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ వీడే ఆలోచన లేదని చెప్పానని పేర్కొన్నారు . ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి తిరిగి రాగానే అమరావతికి వెళ్లి లోకేష్ తో పాటు చంద్రబాబును కూడా కలుస్తానని పేర్కొన్నారు భరత్ . తనకు ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన చంద్రబాబుకు, లోకేష్ కు కృతజ్ఞతతో ఉంటానని ,పార్టీలో కొనసాగుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించారు టీజీ భరత్.