విన్నర్లకి కేసీఆర్ వరాలు, కష్టమని.. గుత్తా జ్వాలా హ్యాపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారని, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం చెప్పారు. పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, కశ్యప్, పీవీ సింధు, గురుసాయి దత్, గగన్ నారంగ్ తదితరులు సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సీఎం అభినందించారు. అనంతరం కేటీఆర్, గోపీచంద్, క్రీడాకారులు విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో క్రీడలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. కామన్వెల్త్ క్రీడల్లో మెడల్స్ సాధించిన వారికి తమ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తుందని చెప్పారు. స్వర్ణం సాధించిన కశ్యప్కు రూ.50 లక్షలు ఇస్తామన్నారు. అలాగే రజతం గెలిచిన వారికి రూ.25 లక్షలు, కాంస్యం గెలిచిన వారికి రూ.15 లక్షల నగదు ప్రోత్సాహక బహుమతి ఇస్తామన్నారు.
ఈ ప్రోత్సాహకాలను పంద్రాగస్టు రోజున వారికి అందజేస్తామన్నారు. అలాగే కోచ్లు పుల్లెల గోపీచంద్, అరీఫ్లకు స్వర్ణం గెలిచిన వారికి ఇచ్చిన ప్రోత్సాహకం ఇస్తామన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనాకు ఇరవై లక్షలు ఇవ్వనున్నారు.
కేసీఆర్ ఎంకరేజ్గా మాట్లాడారని పుల్లెల గోపీచంద్ చెప్పారు. క్రీడలను ప్రోత్సహిస్తామని చెప్పారన్నారు. సైనా నెహ్వాల్ కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కశ్యప్, పీవీ సింధులు కూడా మాట్లాడారు. గుత్తా జ్వాలా మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడేందుకు కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. క్రీడాకారులు అందరు ఆనందం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో కశ్యప్ స్వర్ణం సాధించగా, గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్పలకు రజతాలు వచ్చాయి.
సీఎంను కలిసిన అక్బర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ బుధవారం కలిశారు. సచివాలయంలో ఆయన కేసీఆర్ను కలిశారు.