మాకు నష్టం: తెలంగాణపై బాబు, హోదాని ముగ్గురు వ్యతిరేకిస్తున్నారు: అశోక్
కడప/విజయనగరం: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి నీటి కష్టాలు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు కడప జిల్లాలో అన్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఏపీ నష్టపోతుందని చెప్పారు. ఏపీ, తెలంగాణల మధ్య నీటిని జనాభా ప్రాతిపదికన పంచుకోవాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో ఏపీకి 58 శాతం హక్కు ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ముగ్గురు వ్యతిరేకిస్తున్నారు: అశోక్
ప్రత్యేక హోదా అందరూ కోరుతున్నారు.. కేంద్రం కూడా ఆలోచిస్తోందని కేంద్రమంత్రి అశోక గజపతి రాజు ఆదివారం విజయనగరంలో అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ముగ్గురు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
విభజన జరిగినప్పుడు బిల్లులోనే చేర్చి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా పార్లమెంట్లో మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇంకా యత్నిస్తున్నామన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏదో విధంగా అధిగమించడానికి కేంద్రం కూడా ఆలోచిస్తోందన్నారు.