కెసిఆర్ జాగీర్ కాదు: ఆప్షన్లపై దామోదర, నేతల ఆగ్రహం
హైదరాబాద్: ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవని చెప్పేందుకు కెసిఆర్ ఎవరని మాజీ ఉప ముఖ్యమంత్రి, టిపిసిసి ప్రచార కమిటీ చీఫ్ దామోదర రాజనర్సింహ గురువారం మండిపడ్డారు. తెలంగాణ ఆయన జాగీరు కాదని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఆప్షన్లుండవు.. తెలంగాణ ప్రాజెక్టులు నిండాకే ఆంధ్రకు నీళ్ళిస్తాం...పోలవరం ప్రాజెక్టు కట్టనివ్వమంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై వివిధ పార్టీలు, సంఘాల నేతలు మండిపడ్డారు. రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే కెసిఆర్ లక్షణమని ధ్వజమెత్తారు.
విభజన ప్రక్రియ కేంద్ర విధి విధానాల ప్రకారం జరుగుతుందనిహితవు పలికారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఆప్షన్లు ఉండవంటూ కెసిఆర్ చెప్పడంపై దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పడానికి తెలంగాణ ఆయన జాగీరు కాదన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చిన విధానాల ప్రకారమే ఉద్యోగుల పంపిణీ ఉంటుందని, నిబంధనలు, విధానాల ప్రకారమే నీటి కేటాయింపులు జరుగుతాయని, కెసిఆర్ చెప్పినట్లుగా పంపిణీలు ఉండంవన్నారు.
అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు కేంద్రంలో ప్రత్యేక శాఖలు ఉన్నాయ్ననారు. కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణలో సామాజిక న్యాయం సాధ్యమన్నారు. సోనియా గాంధీ త్యాగనిరతిని, మాటకు కట్టుబడే తీరును గుర్తించి విద్యార్థి సంఘాల నాయకులు కాంగ్రెసు పార్టీలోకి వస్తున్నారన్నారు. రాబోయే కాలంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ తరఫున విద్యార్థి నాయకులు ప్రచారం చేస్తారన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే దీనిపై స్పందిస్తామన్నారు. ఇక, కెసిఆర్ వ్యాఖ్యలపై మధుయాష్కీ మాట్లాడుతూ... ఎంతగా వీలైతే అంత త్వరగా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆతృతతో కెసిఆర్ ఆప్షన్లు, నీటి పంపకాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులు నిండాకే నీటిని దిగువకు వదులుతామన్న కెసిఆర్ వ్యాఖ్యలు కేవలం అధికారం కోసమేనన్నారు. తెలంగాణవాదుల రక్తాన్ని కళ్ల జూసిన కొండా దంపతులను తెరాసలో చేర్చుకున్నారని విమర్శించారు.
సీమాంద్రులపై కాలుదువ్వి, హైదరాబాద్లో ఉన్నవారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే కెసిఆర్ నైజమని ఎపిసిసి అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు అన్నారు. పోలవరంపై ఆయన మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్న ఆయన తన పేరును జగడాల చంద్రశేఖర్ రావుగా మార్చుకుంటే బాగుంటుందన్నారు. ఆయన ప్రవర్తనతో ఇరు రాష్ట్రాల మధ్య స్నేహసంబంధాలు దెబ్బతినే ప్రమాదముందన్నారు. కెసిఆర్ తాటాకు చప్పుళ్లకు బెదరమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు.