చంద్రబాబు కాదా!... నా పూజలవల్లే నష్టం తప్పింది: హుధుద్పై టిఎస్సార్ ఆసక్తికర వ్యాఖ్య
విశాఖ: నేను చేస్తున్న శివపూజల కారణంగానే హుధుద్ తుఫానులో ప్రాణ నష్టం తప్పిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన విశాఖలోని ఆనందపురంను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
శుక్రవారం ఆయన ఆనందపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ నగరాన్ని హుధుద్ తుఫాను వణికించిందన్నారు. ఈ తుఫానులో ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోవడానికి తాను చేస్తున్న శివపూజలే అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
కాగా, సుబ్బిరామి రెడ్డి శివభక్తుడు. హుధుద్ తుఫాను నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. హుధుద్ తుఫానుకు ముందు, ఆ తర్వాత చర్యలు తీసుకుంది. ఈ కారణంగానే ప్రాణ, ఆస్తి నష్టం తక్కువగా జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
2019 నాటికి 60లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తాం: కోడెల
2019 నాటికి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల మరుగుదొడ్ల నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు చెప్పారు. ప్రపంచ మరుగుదొడ్ల సంఘం ప్రతినిధులు కోడెలను కలిశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఏపీ కార్యక్రమంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా కోడెల మాట్లాడారు. పారిశుద్ధ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల్లో అవగాహన లక్ష్యాలతో పనిచేస్తామన్నారు. సత్తెనపల్లిలో 100 శాతం స్ఫూర్తితో రాష్ట్రమంతా మరుగుదొడ్లు నిర్మించి చూపుతామన్నారు. దీని కోసం ప్రవాస భారతీయులు, కార్పోరేట్ సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తామన్నారు.