తెలంగాణలో ఓటింగ్: మహేష్బాబు ఓటు గల్లంతు
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశ్యంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబ సమేతంగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఓట్లు వేశారు. ఇది ఇలా ఉండగా ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు ఓటు గల్లంతవడంతో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.
సినీ హాస్య నటుడు బ్రహ్మానందం దంపతుల ఓట్లు కూటా గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం ఓటు వేయడానికి జూబ్లీహిల్స్లో పబ్లిక్స్కూల్కు వచ్చిన బ్రహ్మానందం దంపతులు ఓటరు లిస్టులో పేరు లేకపోవడంతో వెనుదిరిగారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి ఖైరతాబాద్లోని ఎంఎస్ మక్కాలో గల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి జూబ్లీహిల్స్లోని బిఎస్ఎన్ఎల్ ఆఫీసు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, తన సతీమణి సురేఖ, కుమారుడు రాంచరణ్ తేజతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, చిరంజీవి క్యూలైన్లో కాకుండా నేరుగా వెళ్లడంతో కొందరు ఆయన్ను ఆపారు. క్యూలైన్లోనే రావాలని కోరడంతో కొంత అలజడి చోటు చేసుకుంది. అనంతరం చిరంజీవి క్యూలైన్లో నిల్చుని ఓటేశారు.
సినీ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్లోని బిఎస్ఎన్ఎల్ భవన్ పోలింగ్ కేంద్రంలో, మాజీ డిజిపి వి. దినేష్రెడ్డి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేశారు. కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణ రావు, హీరో నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల జూబ్లీహిల్స్లోని మహిళా ఆర్థిక సహకార సంస్ధ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గాయత్రి హిల్స్లోని లిటిల్ స్టార్ స్కూల్లో, సినీ నటుడు మంచు మోహన్బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో, నిర్మాత రామానాయుడు, వెంకటేష్ ఫిలింనగర్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ రాంనగర్లోని గాయత్రి మాడల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.