జేసీ ఆచూకీ తెలిసింది: దక్షిణాఫ్రికాలో ఉన్నాడని అన్నయ్య వెల్లడి
అమరావతి: తన అనుచరులకు పెయిడ్ గన్మెన్లను కేటయించడంపై కినుక వహించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గత వారం రోజులుగా కనిపించడం లేదు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని కొందరంటుంటే, మరికొందరు హైదరాబాద్లోనే ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దీనిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోలేదని ఆయన స్పష్టం చేశారు. గన్ మెన్ల వ్యవహారం తాను జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద అంశం కాదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తన తమ్ముడు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తలు మీడియా సృష్టేనన్నారు.
తన సోదరుడు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారని చెప్పారు. దక్షిణాఫ్రికా పర్యనట చాలా కాలం క్రితమే ఫిక్స్ చేసుకున్నారన్నారు. తుని ఘటన తర్వాత సీఎం, హోంమంత్రి బిజీగా ఉన్నారని ఈ సమయంలో గన్మెన్ల వ్యవహారం వారితో మాట్లాడటం మంచిది కాదని అందుకే ప్రభాకర్ రెడ్డి దక్షిణాఫ్రికా వెళ్లారని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే గత పదేళ్ల నుంచి దక్షిణాఫ్రికాలో జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన తనయుడు జేసీ అశ్మిత్రెడ్డి పలు వ్యాపారాలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని కొన్ని గనులను కూడా లీజులకు తీసుకొని నడుపుతున్నారని మీడియాలో గతంలో వార్తలు వచ్చాయి. వాటి పని నిమిత్తమే ప్రభాకర్ రెడ్డి దక్షిణాఫ్రికా వెళ్లినట్లుగా తెలుస్తోంది.
కాగా గన్ మెన్లను వెనక్కి పంపించడానికి అనంతపురం జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఆయనకు ఏర్పడమే వివాదం కారణమని తెలుస్తోంది. తన అనుచరులకు పెయిడ్ గన్మెన్లను కేటాయించడం పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనగా తన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గన్మెన్లను ఆయన వెనక్కి పంపించివేసిన సంగతి తెలిసిందే.
T