మేం లేనప్పుడు ఏ కొ..గాడైనా వస్తాడు -పెద్దారెడ్డి ఎంత మగాడో మాకు తెలుసు: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
అనంతపురం జిల్లాలో కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ తగదాలు మరోసారి పేట్రేగిపోయాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. అధికార వైసీపీకి చందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం తన అనుచరులతో కలిసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇప్పటికే టీడీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు.
పెద్దారెడ్డి భార్యకు రూ.10వేలంటూ -వైసీపీ తలపొగరు అణిచేస్తాం -తాడిపత్రి ఘటనపై నారా లోకేశ్ ఫైర్
అసలేం జరిగిందంటే..
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన భార్యను ఉద్దేశించి టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జేసీ అనుచరులైన ఇద్దరు యువకులు.. పెద్దారెడ్డి భార్య ఇసుక దందా నడుపుతున్నారని, ఒక్కో లోడుకు రూ.10వేలు వసూలు చేస్తున్నారంటూ అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో ఆగ్రహించిన పెద్దారెడ్డి.. సదరు యువకులు జేసీ ఇంట్లోనే ఉన్నారనే సమాచారంతో అక్కడికెళ్లి వీరంగం సృష్టించారు. దొరికినవాళ్లను దొరికినట్టు బాదేసి, తాడిపత్రి విడిచెళ్లాలని వార్నింగ్ ఇచ్చి, జేసీ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. నేతలు నేరుగా ఇళ్లపై దాడికి దిగడం ఇదే తొలిసారి కావడంతో తాడిపత్రి ఘటన జిల్లా వ్యాప్తంగ సంచలనం రేపింది. దీనిపై..
వైసీపీ అంతు తేలుస్తాం..
తాడిపత్రిలో జేసీ ఇంటిపై దాడిని టీడీపీ హైకమాండ్ ఖండించింది. వైసీపీ ఎమ్మెల్యే, నేతలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని, జేసీ ఇంట్లో లేని సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడికి పాల్పడటాన్ని ఖండిస్తున్నామని, రౌడీ ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే, టీడీపీనే బుద్ధి చెబుతుందని నారా లోకేశ్ హెచ్చరించారు. టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేసి,కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ విర్రవీగుతున్న వారి తల పొగరు అణిచివేస్తామని, టిడిపి అధికారంలో వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయమని లోకేశ్ అన్నారు. ఇదే ఘటనపై జేపీ ప్రభాకర్ రెడ్డి ఇంకా తీవ్రంగా స్పందించారు.
కేతిరెడ్డి ఎంత మగాడో తెలుసు..
తన ఇంటిపై దాడి ఘటనను టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి జరిపిన కొద్దిసేపటికే విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. పోలీసులు కూడా జేసీ ఇంటికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులు మోహరించారు. ‘‘మేం ఇంట్లో లేనప్పుడు ఏ కొ..గాడైనా వస్తాడు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంత మగాడో మాకు తెలుసు. ఎవరూ లేనప్పుడు నా ఇంటికి వచ్చారు. ఈ విషయంలో తప్పు నాది కాదు.. ఆయనది కాదు.. పోలీసులదే తప్పు''అని జేసీ అన్నారు. అంతేకాదు..
పెద్దారెడ్డిపై కేసు పెట్టను..
తన ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేసిన ఘనలో మొత్తం తప్పంతా పోలీసులదే అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డి కోసం పోలీసులే పరుగెత్తుకుంటూ వచ్చి తన ఇంటి గేట్లు తీశారని జేసీ చెప్పారు. ఎమ్మెల్యే కొడవలి చేతబట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయబోనంటూ జేసీ ట్విస్ట్ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ తీసి పోలీసులే సుమోటోగా కేసు పెట్టి విచారణ జరిపించాలని జేసీ డిమాండ్ చేశారు. ఇసుక దొరకలేదని చెప్పినోడే పెద్దారెడ్డి భార్య ఆడియోను వైరల్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
భార్యపై అనుచిత పోస్టులు: జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి -తాడిపత్రిలో భయానక యుద్ధం