నకిలి పాస్ పుస్తకాలతో రుణాలు-తహసీల్దార్ అరెస్ట్;కడప జిల్లాలో కలకలం
కడప: జిల్లాలో నకిలీ పాసు పుస్తకాలతో వ్యవసాయ రుణాలు పొందేందుకు అక్రమార్కులకు సహకరించిన ఒక తహసీల్దార్ ను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. తహసీల్దార్ అరెస్ట్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రెవిన్యూ శాఖలో కలకలం రేపుతోంది.
కడప జిల్లా వేంపల్లెలో 2015-16 మధ్యకాలంలో బోగస్ పాసు పుస్తకాలతో కొందరు రైతులు 65 లక్షల 76 వేల రూపాయల రుణాలు తీసుకున్నారు. అయితే వీరు ఈ రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఈ వ్యవహారం బైటకు వచ్చింది. ఈ బోగస్ రుణాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్, వీరపునాయనపల్లె తహసీల్దార్ కృష్ణ నాయక్, మరి కొందరు అధికారులు సహకరించారని సబ్ కో ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధికారి ఫిర్యాదుతో...పోలీసుల విచారణ...
ఈ బోగస్ రుణాల విషయమై ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ స్కామ్ కు సంబంధించి మొత్తం 17 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరైన వీరపునాయనపల్లె తహసీల్దార్ కృష్ణ నాయక్ ను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
స్కామ్...ఎలా జరిగిందంటే?...
కడప జిల్లా వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో...అసలు భూములే లేకుండా లేని భూములపై రుణాలు పొందిన వ్యవహారం రెండేళ్ల క్రిందట వెలుగు చూసింది. కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జిఎం వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో అప్పటి కలెక్టర్ కలెక్టర్ కె.వి.సత్యనారాయణ స్పందించి విచారణ జరపాలని జిల్లా సహకార శాఖను ఆదేశించారు. ఆమేరకు ప్రొద్దుటూరు డివిజనల్ సహకార శాఖాధికారి రమేష్ విచారణ జరిపి చింతలమడుగుపల్లె సొసైటీలో అక్రమాలు వాస్తవమేనని నిర్థారించారు.
ఇలా రుణాలు...మొదట ఎవరంటే...
చింతలమడుగుపల్లె సొసైటీ కార్యదర్శి నాగప్రసాద్రెడ్డి ఇలా నకిలి పాస్ పుస్తకాలతో తన భార్య, తల్లి పేరుతో వీరపునాయునిపల్లె మండలం లింగాల గ్రామంలోని సర్వే నంబర్ల భూములపై బోగస్ రుణాలు పొందడం నిజమేనని విచారణలో గుర్తించారు. ఇంకా విచిత్రమేమిటంటే...సొసైటీ కార్యదర్శి తన కుటుంబసభ్యుల పేరిట వేంపల్లె డీసీసీబీ శాఖలో డిసెంబరు 14న రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా...నవంబరులోనే క్షేత్ర పరిశీలన జరిపి రుణ మంజూరు నివేదిక ఇచ్చినట్టు ఈ విచారణలో తేలినట్లు తెలిసింది.
అక్రమాలే అక్రమాలు...అధికారుల సహకారం...
అయితే రుణ దరఖాస్తుకు ముందే ఇలా క్షేత్ర పరిశీలనకు వెళ్లడంపై వేంపల్లె బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నదని విచారణ అధికారులు గుర్తించారు. మరోవైపు వీరపునాయునిపల్లె మండలంలో నాగప్రసాదరెడ్డి తన కుంటుబానికి లేని భూములపై మీసేవా ద్వారా తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సహా 1-బీ, అడంగల్, ఇతర పత్రాలు పొందారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ పాత్ర ఉందని నిర్ధారించారు. అయితే తాను తీసుకున్న బోగస్ రుణాల్లో ఎక్కువ మొత్తం సొమ్మును డీసీసీబీ జనరల్ మేనేజర్,ఇతర ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు సొసైటీ కార్యదర్శి నాగప్రసాద్రెడ్డి విచారణ సందర్భంగా అధికారులకు వాగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది.
తహసీల్దార్ అరెస్ట్ తో...కలకలం...
నకిలీ పాస్ బుక్కులు, వాటితో రుణాలు, తిరిగి చెల్లించకపోవడం ఈ కారణాలతో వీరపునాయనపల్లె తహసీల్దార్ కృష్ణ నాయక్ ను అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా రెవిన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మిగతావారికి తాజా పరిణామంతో గుండెళ్లు రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు నకిలీ పాసుబుక్కులు, రుణాల విషయమై రాష్ట్రంలో పలు చోట్ల ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్న ప్రాంతాల్లో కలకలం రేగింది. పైగా ఈ వ్యవహారంలో ఏకంగా తహసీల్దార్ నే అరెస్ట్ చెయ్యడంతో ఒత్తిడి కారణంగానో, ఆమ్యామ్యాలకు ఆశపడో ఈ విధంగా పాసుబుక్కుల జారీకి సహకరించిన రెవిన్యూ అధికారులు భుజాలు తడుముకుంటున్నారు.