నక్క తోక తొక్కిన టీడీపీ ఎంపీ: ఆయన కంపెనీలో వంద కోట్ల పెట్టుబడి: తైవాన్ సంస్థ రెడీ: చిత్తూరులో యూనిట్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ నక్కతొక తొక్కారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దెబ్బకు పరిశ్రమలకు కుదేల్ అవుతున్నాయని, పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారంటూ విమర్శలు గుప్పించిన ఆయన సంస్థలోనే ఏకంగా వంద కోట్ల రూపాయల మేర పెట్టబడులు పెట్టడానికి ఓ విదేశీ సంస్థ ముందుకొచ్చింది. గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్తో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా- చిత్తూరు జిల్లాలో ఓ యూనిట్ను కూడా నెలకొల్పబోతోంది.
ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్ల బ్యాటరీల తయారీ కోసం..
తైవాన్కు చెందిన ఆ సంస్థ పేరు సలోమ్. పవర్ ఛార్జింగ్లను ఉత్పత్తి చేసే సంస్థ అది. యు ఛార్జ్ క్యూ బ్రాండ్నేమ్ మీద పవర్ బ్యాంక్స్, బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంటుంది. ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, టెలిఫోన్స్తో పాటు వాక్యూమ్ క్లీనర్ వంటి పరికరాలకు వినియోగించే రీఛార్జబుల్ బ్యాటరీలను తయారు చేయడానికి అమరరాజా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొటొరోల, ఫిలిప్స్, పానసోనిక్, జియో, సోనీ, లెనొవొ వంటి బడా కంపెనీలు సలోమ్ సంస్థకు క్లయింట్లుగా ఉంటున్నాయి.
కరోనా వైరస్ భయంతో ఏపీలో పెట్టుబడులు..
నిజానికి- చైనా ప్రభుత్వ ఆధీనంలోని గ్ఝియామెన్ ఐలండ్లో సలోమ్ సంస్థకు చెందిన బ్యాటరీల తయారీ యూనిట్లు ఉన్నాయి. దాన్ని విస్తరించడానికి ఇదివరకే ప్రణాళికలను కూడా రూపొందించుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని తన వ్యాపార కార్యకలాపాలను ఆరంభించే సాహసం చేయలేదు. అదే సమయంలో- గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ ప్రతినిధులు సలోమ్ యాజమాన్యాన్ని సంప్రదించారు. అమరరాజా ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
తొలిదశలో వంద కోట్ల పెట్టుబడి..
దీనితో తొలిదశలో వంద కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి సలోమ్ యాజమాన్యం అంగీకరించింది. అనంతరం దీన్ని విస్తరించనుంది. సలోమ్ సంస్థ అమ్మకాల్లో కనీసం 30 శాతం మే బ్యాటరీలను అమరరాజా యూనిట్ నెలకొల్పబోయే యూనిట్ నుంచే తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. అమరరాజా యాజమాన్యంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) కిఫ్ వాంగ్, ఆ సంస్థ భారత ప్రతినిధి ఎఎస్ రాజ్కుమార్ హైదరాబాద్కు వచ్చారు. రెండురోజుల్లో వారిద్దరూ చిత్తూరు, తిరుపతిల్లో గల అమరరాజా సంస్థ యూనిట్లను సందర్శించనున్నారు.
800 మందికి ఉపాధి..
సలోమ్ సంస్థకు కుదుర్చుకోబోయే ఒప్పందాల్లో భాగంగా.. ఆ సంస్థకు కావాల్సిన ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్ల బ్యాటరీలను తయారు చేయడానికి ప్రత్యేకంగా అమరరాజా బ్యాటరీ సంస్థ ఓ తయారీ యూనిట్ను నెలకొల్పాల్సి ఉంటుంది. మరే ఇతర ఉత్పత్తులను కూడా ఈ యూనిట్లో చేపట్టకూడదు. ప్రత్యేకించి ఆ సంస్థ కోసమే కొత్తగా యూనిట్ను నెలకొల్పాల్సి ఉన్నందున కనీసం 800 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. చిత్తూరు పరిసరాల్లో ఈ యూనిట్ను నెలకొల్పబోతున్నారు.
Recommended Video
విమర్శించిన పార్టీ నేతల సంస్థల్లో పెట్టుబడులు..
రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నాయని, అనంతపురం నుంచి కియా కార్ల తయారీ యూనిట్ చెన్నైకి తరలిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే సమయంలో అదే టీడీపీకి చెందిన గల్లా జయదేవ్ సంస్థలో విదేశీ సంస్థ వంద కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతుండటం వల్ల అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది.