రాజమౌళిని లండన్ పంపండి: ‘రాజధాని’పై రాజీపడని చంద్రబాబు
ఏపీ రాజధానిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబునాయుడు ఎక్కడా రాజీ పడటం లేదు.
Recommended Video
అమరావతి: ఏపీ రాజధానిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబునాయుడు ఎక్కడా రాజీ పడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్మించే కీలక భవనాలు తుది ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ బృందంతో సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల నమూనాలపై చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరింత అందంగా, సౌకర్యంగా భవనాలు ఉండాలని సూచించారు.
అద్భుతంగా అసెంబ్లీ, హైకోర్టు: రాజధానికి వన్నె తెచ్చే భవనాలివే(పిక్చర్స్)
రాజమౌళిని లండన్ పంపండి..
రాజధాని భవన నిర్మాణల వ్యవహారంలో అవసరమైతే ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో వెంటనే సంప్రదింపులు జరపాలని సీఆర్డీఏ కమిషనర్ను సీఎం ఆదేశించారు. అంతేగాక, అవసరమైతే తన బృందంతో సహా రాజమౌళిని లండన్ పంపించి ఆకృతుల తయారీలో ఫోస్టర్ సంస్థకు తగు సూచనలు, సలహాలు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు.
బయట బాగా లేదు, ప్రపంచంలోని 10 భవనాలకు ధీటుగా: అమరావతి డిజైన్లపై బాబు అసంతృప్తి
యూకే పర్యటన
వచ్చే నెలలో యూఎస్, యూఏఈ పర్యటనతో పాటు యూకే వెళ్లాలని నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పారు. అక్టోబరు 25న తాను స్వయంగా లండన్ వెళ్లి ఫోస్టర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ వారు రూపొందించే ఆకృతులను పరిశీలిస్తానని చెప్పారు.
పూర్తి స్వేచ్ఛతో..
నార్మన్ ఫోస్టర్ బృందం సమర్పించే ఆకృతులను అక్టోబరు నెలాఖరులోగా ఖరారు చేయొచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ఆకృతుల తయారీలో పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించాలని, అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శించాలని ఈ సమీక్షలో చంద్రబాబు సూచించారు.
సమయం తీసుకోండి..
ఇప్పుడు అందించిన ఆకృతుల్లో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయని, అయితే.. బాహ్య రూపం అంత గొప్పగా రాలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కావాలంటే మరికొంత సమయం తీసుకుని భవంతుల నిర్మాణ వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం అన్నారు. ఈ క్రమంలో నార్మన్ ఫోస్టర్ బృందం రాజధాని భవనాలకు మరిన్ని హంగులు అద్దే ప్రయత్నంలో పడింది.