అదిగదిగో అమరావతి: సరికొత్త మ్యాప్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మనదేశ సరికొత్త పొలిటికల్ మ్యాప్ లో రాష్ట్ర రాజధాని అమరావతిని గుర్తించక పోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పందించారు. జమ్మూ కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ లో మన రాష్ట్ర రాజధాని అమరావతి పేరును పొందు పరచలేదు. ఏపీ మినహా దేశంలో 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను ముద్రించిన ఈ మ్యాప్ అమరావతిని గుర్తించలేదు.
కొత్త మ్యాప్ ను విడుదల చేసిన కిషన్ రెడ్డి..
దీనిపై జీ కిషన్ రెడ్డి స్పందించారు. లోక్ సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ఈ అంశాన్ని తాను సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, తప్పును సరి చేశానని అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ రూపొందించిన సరికొత్త మ్యాప్ ను ఆయన విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన తన ట్విట్టర్ లో ఈ మ్యాప్ ను ఆవిష్కరించారు. ఇందులో గులాబీ అక్షరాలతో అమరావతి అనే అక్షరాలను పొందుపరిచారు. అంతకుముందు విడుదలైన మ్యాపుల్లో ఈ పేరు ఉండేది కాదు.
కేంద్రాన్ని నిలదీసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, గల్లా జయదేవ్..
సరికొత్త పొలిటికల్ మ్యాప్ లో అమరావతిని పొందుపరచని అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సభా పక్ష నాయకుడు గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంటుండటాన్ని నిరసిస్తూ రెండురోజుల కిందటే ఆ రెండు పార్టీల నాయకులు స్పీకర్ ఓం బిర్లాకు జీరో అవర్ నోటీసును అందజేసిన విషయం తెలిసిందే.
జీరో అవర్ లో ప్రస్తావన..
గురువారం లోక్ సభలో జీరో అవర్ లో మిథున్ రెడ్డి, గల్లా జయదేవ్ రాజధాని అమరావతి అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొందని, చివరికి కేంద్ర ప్రభుత్వం మ్యాప్ లో కూడా అమరావతిని గుర్తించని పరిస్థితి నెలకొందని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, గల్లా జయదేవ్ మధ్య కొంతసేపు వాగ్వివాదం నడిచింది.
తప్పును సరిచేశామన్న కిషన్ రెడ్డి..
సభ్యులు లోక్ సభలో లేవనెత్తిన అనేక ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి సమాధానాలను ఇచ్చారు. రాజధాని అమరావతిని గుర్తించకపోవడంలో పొరపాటు జరిగిందే తప్ప అది ఉద్దేశపూరకంగా చోటు చేసుకున్న ఉదంతం కాదని అన్నారు. దీన్ని తాను సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, తప్పును సరి చేశామని చెప్పారు. తాజాగా మ్యాప్ ను విడుదల చేస్తామని అన్నారు. అదే సమయంలో తన ట్విట్టర్ లో కొత్త మ్యాప్ ను ఆయన విడుదల చేశారు.