ఏపిలో పాలన సరిగా లేదన్న తలసాని..! వచ్చిన పని చూస్కొని వెళ్లి పోవాలన్న టీడిపి నేతలు..!!
విజయవాడ/ హైదరాబాద్ : ఏపి వెళ్లిన తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏపి ప్రభుత్వంపై పలు విమర్శలు చేసారు. ఏపిలో బీసిలకు తగు ప్రాధాన్యత లేదని, ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి లో కూడా ఎపి ముందంజలో ఉందని, ఏ పని కావాలన్నా డబ్బు ఇవ్వాల్సిందే నని విమర్శించారు. చంద్రబాబు ఏక పక్ష నిర్ణయాలతో ప్రజలను తప్పుదోవ పట్టుస్తున్నారని తలసాని అన్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో ఏపి ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని జోస్యం చెప్పారు.
నాకు ఎపికి వచ్చే హక్కు లేదా అని, తాను ప్రెస్ మీట్ లు పెట్టకూడదా అని, విజయవాడ వస్తే పోలీసులను పంపి విచారణ చేయిస్తారా అని తలసాని ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా ఏపిలో కుల రాజకీయాలు చేస్తే సహించేది లేదని ఏపి టీడిపి నేతలు తలసాని శ్రీనివాస యాదవ్ ని హెచ్చరించారు.
లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం లో ఇన్ని కోట్లు పెట్టి పత్రికలు, ఛానళ్లలో ప్రకటనలు అవసరమా అని, ధర్మపోరాట దీక్ష లకు పది కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేయడం ఎంత వరకు సబబు అని తలసాని అన్నారు. ఎపికి తమ అండదండలు ఉంటాయని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రకటించారని, కానీ చంద్రబాబు రాజకీయం చేస్తూ తమకు మోడి, జగన్, పవన్ లతో ముడి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు పార్టీలతో సంబంధం లేదని, తమ బిసి కులాల ను చైతన్యం చేస్తానని తలసాని ప్రకటించారు. కాగా తెలంగాణలో రెండు నెలలు దాటుతున్నా ఇంతవరకు మంత్రివర్గ విస్థరణ, పరిపాలనపై ద్రుష్టి పెట్టని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గురించి స్పందించాలని ఏపి టీడిపి నేతలు తలసానికి చురకలు వేసారు. తెలంగాణలో పడకేసిన పాలన, ఆర్థిక లోటు తదితర అంశాల పై ద్రుష్టి సారించుకోవాలని, పక్క రాష్ట్ర అంతర్గత విషయాల గురించి స్పందించకుండా వుంటే బాగుంటుందని ఏపి టీడిపి నేతలు తలసానికి సూచించడం విశేషం.!