ఏపీలో టీడీపీతో పొత్తుపై ఇంకా చర్చలు జరగలేదు...అధిష్టానందే నిర్ణయం:ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
కడప:ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ఇంకా చర్చలు జరగలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వెల్లడించారు. అయితే ఈ విషయమై అధిష్టానం నిర్ణయం మేరకే కలిసి పనిచేస్తామని తులసిరెడ్డి తేల్చిచెప్పేశారు.
కడప లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపితో కాంగ్రెస్ పొత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఎపికి సంబంధించి విభజన చట్టంలోని అంశాలను బీజేపీ తొక్కి పెట్టిందని ఆయన మండిపడ్డారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి టీడీపీ సర్కారు ముందుకు రావడం సంతోషమే నని...అయితే దానిని ఎన్నికల హామీగా మార్చొద్దని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.
కారణం ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని...తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా విభజన హామీలన్నీ నెరవేరుస్తామని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ నియంతలా మారి ప్రజాస్వామ్యాన్ని సర్వ నాశనం చేస్తున్నారని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలు దేశంలో మోడీ శకం ముగిసిందని తేల్చిచెప్పాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం విజయం సాధించడమే కాకుండా బళ్లారి లోక్ సభ స్థానంలో 2,43,161 ఓట్ల మెజారిటీతో, మాండ్య లోక్ సభ స్థానంలో 3,24,943 ఓట్ల భారీ మెజారిటీ సాధించిందన్నారు. అలాగే రాంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో 1,09,137 ఓట్లు, భీమ్ ఖండీ అసెంబ్లీ స్థానంలో 39,480 ఓట్ల మెజారిటీ రావడం గమనించాలన్నారు.
ఈ ఉప ఎన్నికల ఫలితాల సరళి త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో...అలాగే 2019లో దేశమంతటా జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతం కావడం ఖాయమన్నారు. తథ్యం అన్నారు. దేశంలో మోడీ శకం ముగిసి...రాహుల్ శకం ప్రారంభం అయ్యిందని వ్యాఖ్యానించారు.