రాయపాటికి సీబీఐ స్ఫూఫింగ్ కాల్స్- తెర వెనుక తమిళనటి మరియాపాల్ - కేసు నుంచి తప్పిస్తానని..
టీడీపీకి చెందిన మాజీ మంత్రి రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును ఆసరాగా చేసుకుని ఆయన్ను బెదిరింపులకు పాల్పడిన వ్యవహారం చిక్కుముడి వీడుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు తమిళనటి మరియాపాల్, ఆమె భర్త, ఇతర అనుచరుల పాత్ర ఉందని గుర్తించారు. త్వరలో వీరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో రాయపాటిని వీరు ఎలా బెదిరించారన్న అంశంలో సీబీఐ బయటపెడుతున్న వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా రేపుతున్నాయి.
ఈసారి 'ఫటాఫట్' మంత్ర.. జగన్ కీలక నిర్ణయం.. మునుపెన్నడూ లేని రీతిలో...
రాయపాటికి బెదిరింపు కాల్స్...
బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ గతేడాది కేసు నమోదు చేసింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ద పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఆయన తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. అయితే ఇదే అదనుగా ఆయన్ను బెదిరించి డబ్బులు గుంజాలని తమిళనాడుకు చెందిన ఓ ముఠా ప్లాన్ సిద్దం చేసింది. దీన్ని అమలు చేసే క్రమంలో వారు దొరికిపోయారు.
తమిళనటి మరియాపాల్, ఆమె భర్త..
బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ రాయపాటిని లక్ష్యంగా చేసుకుంటే బోలెడు డబ్బులు సంపాదించవచ్చని తమిళ నటి లీనా మరియా పాల్, ఆమె భర్త, అనుచరులు ప్లాన్ సిద్ధం చేశారు. అనుకున్నతే తడవుగా ఈ ఏడాది జనవరి 3న రాయపాటికి మరియాపాల్ అనుచరుల్లో ఒకడైన మణివర్దన్ రెడ్డి సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేశాడు. డబ్బులిస్తే ఈ కేసు నుంచి తప్పిస్తామన్నారు. ఆ తర్వాత నేరుగా గుంటూరు వెళ్లి రాయపాటిని కలిసి అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాయపాటిని హెచ్చరించాడు.
బెదిరింపుల కుట్ర వీడిందిలా....
ఎప్పుడైతే సీబీఐ అధికారుల పేరుతో మణివర్ధన్ రెడ్డి బెదిరింపులకు దిగాడో అప్పుడే అనుమానమొచ్చిన రాయపాటి సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు మణివర్ధన్ రెడ్డితో పాటు మరో నిందితుడు రామరాజ్ ను హైదరాబాద్, చెన్నైలో అరెస్టు చేశారు. వీరిని విచారించగా.. ఈ మొత్తం వ్యవహారానికి అసలు సూత్రధారులు తమిళనటి లీనా మరియాపాల్, ఆమె భర్త అని తేలింది. దీంతో పోలీసులు వీరి పాత్రను నిర్ధారించుకున్నారు. త్వరలో పూర్తి ఆధారాలతో వీరిని అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నారు.
Recommended Video
మరియాపాల్ స్ఫూఫింగ్ కాల్స్ దందా...
మరియాపాల్ దందాలపై దర్యాప్తు చేసిన సీబీఐకి కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిశాయి. మరియాపాల్ ముఠా దేశంలో ఎక్కడ ఎవరిపైన సీబీఐ కేసు నమోదైనా చాలు అక్కడ వాలిపోతారని, వారిపై బెదిరింపులకు పాల్పడతారని, అందిన కాడికి దోచుకుని విదేశాలకు సైతం తరలిస్తారని అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దేశంలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న పలువురు వీఐపీలు వీరి బాధితులుగా మారినట్లు తేలింది. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. మరోవైపు ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో కేంద్ర ఆర్ధిక నేరాల విభాగం మరియాపాల్ తో పాటు మరో ఐదుగురిని 2015లో అరెస్టు చేసింది.