చంద్రబాబుపై కుప్పంలో పోటీ-క్లారిటీ ఇచ్చేసిన విశాల్-ఏం చెప్పారో తెలుసా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష నేత చంద్రబాబును కుప్పంలో దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. విపక్ష నేతకు పోటీ చేసేందుకు నియోజకవర్గమే లేకుండా చేయాలని భావిస్తున్నవైసీపీ .. అందుకు తగ్గట్టుగానే ఆయన్ను బలహీనం చేసేందుకు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అన్ని ప్రయత్నాలూ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఫైనల్ గా చంద్రబాబుపై కుప్పంలో హీరో విశాల్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనిపై తాజాగా వైసీపీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు హీరో విశాల్ పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
కుప్పం పోటీపై స్పందించిన విశాల్
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో విపక్ష నేత చంద్రబాబుపై పోటీకి వైసీపీ తరఫున తనను నిలబెడుతున్నారంటూ వచ్చిన వార్తలపై హీరో విశాల్ ఇవాళ స్పందించారు. చంద్రబాబుపై పోటీకి తనను వైసీపీ రంగంలోకి దింపుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ కుప్పం నుంచి పోటీ చేయించే అభ్యర్ధిపై క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు విశాల్ కూడా స్పందించడంతో ఈ వివాదం త్వరలో సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుప్పంలో పోటీ ఫేక్ అన్న విశాల్
టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పం నియోజక వర్గం నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండింగ్గా మారటంతో.. ఈ రూమర్స్పై విశాల్ స్పందించారు. ఈ విషయంపై స్పందించిన విశాల్... అవన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు."ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నానని, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే వదంతులు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఖండిస్తున్నానన్నారు.
చంద్రబాబుపై పోటీ ఉద్దేశం లేదు
రాజకీయాలకు సంబంధించి తనను ఇప్పటివరకూ ఎవరూ కలవలేదని విశాల్ తెలిపారు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదన్నారు.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నానని, ఏపీ పాలిటిక్స్లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని విశాల్ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటివరకూ దీనిపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసే అభ్యర్ధి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరతేనని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు.