సంక్రాంతి గిఫ్ట్: బాబు బాటలో జయలలిత, ఏపీ కంటే ఓ అడుగు ముందు
చెన్నై/విజయవాడ: తమిళనాడులోని 'అమ్మ' పథకాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆకట్టుకోగా, చంద్రబాబు 'చంద్రన్న సంక్రాంతి కానుక' తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆకట్టుకున్నట్లుగా ఉన్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు తరహా కానుకను జయలలిత ప్రకటించారు. బుధవారం ఆమె రేషన్ కార్డు దారులకు సంక్రాంతి కానుక ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఈ కానుక ఇవ్వనున్నారు.
కుటుంబానికి ఒక్కరికి కిలో చొప్పున బియ్యం, చక్కెర, రెండు అడుగుల చెరకు గడలు వీటితో పాటు రూ.100 ఇవ్వనున్నారు. ఆమె చెన్నైలో బుధవారం ప్రకటి చేశారు. ఈ నెల జనవరి 15న సంక్రాంతి పర్వదినం ఉంది. రేషన్ దుకాణాల ద్వారా వీటిని సరఫరా చేయనున్నారు.
జయలలిత ఇప్పటికే 'అమ్మ' పేరుతో పలు పథకాలు చేపడుతున్నారు. అమ్మ క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకే సామాన్యులకు నాణ్యతతో కూడిన ఫలహారం, భోజనం అందిస్తున్నారు.
కాగా గత ఏడాది నుంచి ఏపీ సీఎం చంద్రబాబు సరికొత్తగా ప్రవేశపెట్టిన ‘సంక్రాంతి కానుక' జయలలితను బాగానే ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సబ్సీడీ రేట్లకే రేషన్ హోల్డర్లకు సరుకులను పంపిణీ చేస్తున్న పథకానికి ప్రజలు బాగానే స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా,క జయలలిత తమిళనాడులోనూ సంక్రాంతి కానుకను ప్రవేశ పెడుతున్నారు. అయితే చంద్రబాబు కంటే ఓ అడుగు ముందుకేసిన జయలలిత... రేషన్ సరుకుల (బియ్యం, పంచదార)తో పాటు రూ.100 నగదును కూడా అందచేస్తున్నారు.