చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే?: స్టిక్కర్ అతికించిన కారులో బ్లాక్మనీ, బంగారం?: తమిళనాడులో సీజ్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు చిక్కుల్లో పడ్డారు. ఆయన పేరును ముద్రించిన ఎమ్మెల్యే స్టికర్ను అతికించిన ఎస్యూవీ కారు తమిళనాడులో పోలీసుల చేతికి చిక్కింది. ఈ కారులో లెక్క చూపని నగదు, బంగారం ఉన్నట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు. నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్, అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాలను వణికించిన భూకంపం: పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో ఏకకాలంలో: భారీ తీవ్రతతో
హవాలా కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందనే విషయంపై తమిళనాడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించినట్లు తెలుస్తోంది. తమ పార్టీకి గానీ, ఎమ్మెల్యేతో గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. హైసెక్యూరిటీ ఎమ్మెల్యే స్టిక్కర్ను గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపర్ చేసి ఉండొచ్చని వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. అన్నా రాంబాబు ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరువాత అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన రెండో ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. వృత్తిపరంగా ఆయన వ్యాపారవేత్త. ఆయన పేరు గల స్టిక్కర్ను గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి ఉండొచ్చని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు.
దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని అంటున్నారు. హవాలా కేసు కింద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించిన కారును తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ ఘటనపై స్పందించారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారుతో అన్నా రాంబాబుకు ఎలాంటి సంబంధం లేదని, దాన్ని ఫోర్జరీ చేసి ఉంటారని చెబుతున్నారు వైసీపీ జిల్లా నేతలు.