తమిళనాడు డబ్బు ఎవరిదంటే.. విమర్శలతో బాలినేని మనస్తాపం-రాజీనామా చేస్తానంటూ..
తమిళనాడు బోర్డర్ చెక్ పోస్టు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్న ఫార్చూనర్ వాహనంలో ఐదుకోట్ల నగదు లభించడం, అది కాస్తా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది అని, ఆ తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుదిగా ప్రచారం జరిగినా వీరిద్దరూ దాన్ని ఖండించడం జరిగిపోయాయి. మరి ఆ డబ్బు ఎవరిది అయి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేయగా.. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తిది అని తేలింది. ఆ లోపు మొదలైన టీడీపీ, వైసీపీ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం మాత్రం కొనసాగుతోంది.
తమిళనాడు డబ్బెవరిది ?
తమిళనాడులోని ఓ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద నిన్న ఆ రాష్ట్ర పోలీసుల తనిఖీల్లో దొరికిన ఐదు కోట్ల డబ్బెవరిదో తేల్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డబ్బు దొరికిన ఫార్చూనర్ వాహనంపై ఎమ్మెల్యే వెహికల్ స్టిక్కర్ ఉండటంతో దాన్ని పరిశీలించి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుదిగా ముందుగా భావించారు. కానీ ఈ స్టిక్కర్ జిరాక్స్ చేసి వాడుతున్నట్లు పోలీసులు తర్వాత తేల్చారు. ఆ తర్వాత వాహనం డ్రైవర్ ఒంగోలుకు చెందిన వాడు కావడంతో స్ధానిక ఎమ్మెల్యే, మంత్రి బాలినేనిదిగా ప్రచారం జరిగింది. కానీ ఆ డబ్బు తనది కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ లోపే టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు, విమర్శలు కొనసాగించారు.
టీడీపీ విమర్శలు-రాజీనామా చేస్తానన్న బాలినేని..
తమిళనాడులో పట్టుబడ్డ నగదు వైసీపీ ఎమ్మెల్యే లేదా మంత్రిది అని ప్రచారం జరగడంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు ఒకరి వెంట ఒకరుగా విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ లోకేష్ తో పాటు మిగతా టీడీపీ నేతలు కూడా వరుస విమర్శలు చేయడంతో మంత్రి బాలినేని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా విమర్శలు ఆగకపోవడంతో మరోసారి ఆయనే వివరణ ఇచ్చారు. టీడీపీ నేత బోండా ఉమ విమర్శలపై స్పందిస్తూ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చకూడా లేదని, దొరికిన డబ్బు తనదే అని బోండా ఉమ నిరూపిస్తూ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
ఇంతకీ డబ్బెవరిదంటే...
తమిళనాడు చెక్ పోస్ట్ వద్ద దొరికిన డబ్బుపై ఓ వైపు రాజకీయ దుమారం కొనసాగుతుండగా... ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు అది తనదేననంటూ ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఏ రాజకీయపార్టీకి, నాయకులకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి నగదు విడిపించుకుంటామని బాలు చెప్పారు.