ఏపీ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు ... సంక్రాంతి సమయంలో బస్సుల వివాదం .. తెరపడిందిలా !!
ఏపీ సర్కార్ తమిళనాడు సర్కార్ కు ఝలక్ ఇచ్చింది . సంక్రాంతి పండుగ సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఉన్నప్పటికీ ఏపీకి సంబంధించిన 5 బస్సులను తమిళనాడు ప్రభుత్వం చిన్న చిన్న కారణాలతో అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన 5 బస్సులను ఆపితే, ఏపీ ప్రభుత్వం ఏకంగా తమిళనాడుకు చెందిన 24 బస్సులను ఆపింది. దీంతో దెబ్బకు తమిళనాడు ప్రభుత్వం దిగొచ్చింది.
తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి: కోడిపందాల హడావిడి..రోడ్లపై వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్
పర్మిట్లు లేవని ఏపీకి చెందిన 5 బస్సులను ఆపిన తమిళనాడు
బస్సులో పర్మిట్లు లేదనే కారణంతో తిరుపతి డిపోకు చెందిన మూడు బస్సులను, చిత్తూరు డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో తమిళనాడు అధికారులతో చర్చలు జరపాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సూచించారు. అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఆపడం వెనుక ప్రైవేటు ట్రావెల్స్ కుట్ర ఉందని గుర్తించిన ఏపీ సర్కార్ వెంటనే రంగంలోకి దిగింది.
పర్మిట్ లేని 24 తమిళనాడు బస్సులను నిలిపివేసిన ఏపీ
తమిళనాడుకు చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులపై కొరడా ఝుళిపించింది. పర్మిట్ లేని 24 బస్సులను నిలిపివేసింది. ఇక ఈ నేపథ్యంలో తమిళనాడు అధికారులు దిగొచ్చి ఆంధ్రప్రదేశ్ అధికారులతో చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు సఫలం కావడంతో వివాదం సద్దుమణిగింది. రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర ఒప్పంద ఉన్నప్పటికీ తమిళనాడు అధికారులు బస్సులు ఆపటం ఏపీ అధికారులకు ఏ మాత్రం నచ్చలేదు .
దిగొచ్చిన తమిళనాడు .. ఏపీ అధికారులతో చర్చలు... కుదిరిన సయోధ్య
సంక్రాంతి పండుగ రద్దీదృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ కు సంబంధించిన బస్సులు నిలిపివేయడం ఏపీ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసి చూపించిన ప్రతి చర్యతో తమిళనాడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అధికారులతో చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది . చర్చలు ఫలవంతం కావడంతో, చివరకు ఇరు రాష్ట్రాల బస్సులను వదిలివేశారు.