వైద్యులకు చూపండి: బాబుపై తమ్మినేని, జగనేనా అని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్పార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి ప్రతిచోటా చంద్రబాబు నాయుడకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే సరిపోతుందని అన్నారు.
బహుశా చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమోనన్న ఆయన, చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు మంచి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. తాను కూడా గతంలో ఆయన వద్ద పని చేసినవాడినే కాబట్టి చంద్రబాబు శ్రేయోభిలాషిగా ఈ మాట చెబుతున్నానన్నారు.
కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ చేస్తానని, మరికాసేపటికి ముంబై చేస్తానని ఆయన చెబుతున్నారని ఆరోపించారు. ఆర్థిక సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ప్రతిపాదనల్లో ఏమాత్రం పసలేదని ఆయన మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆర్థిక సంఘం వద్ద తమకు ఏయే అవసరాలకు ఎంతెంత నిధులు కావాలన్న విషయాలను నిర్మాణాత్మకంగా చెప్పి నిధులు తెచ్చుకోవాలని.. అంతే తప్ప గత ప్రభుత్వాల మీద బురద జల్లడానికి చూడానికి ఈ నివేదికనే ఉపయోగించుకోవడం సరికాదని తమ్మినేని సీతారాం సూచించారు.