‘బాబు మొదటి పులకేశి.. లోకేష్ పప్పు.. ఏపీ కేబినెట్ ఓ జోకర్స్ డెన్’
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కర్నూలు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మొదటి పులకేశి, లోకేష్ రెండో పులకేశిగా తయారయ్యారని, ఏపీ కేబినెట్ జోకర్స్డెన్గా మారిందని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సీట్ల పెంపు 2026 వరకు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీలో ప్రకంపనలు రేగాయని అన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీట్లు పెరుగుతాయంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్వీట్లు కూడా తినిపించారని ఎద్దేవా చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా చంద్రబాబును నిలదీయాలని తమ్మినేని సూచించారు. ఓటుకు రూ.5వేలు ఇచ్చి కొనగలనన్న చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు.
పప్పు లోకేష్ అంటూ నారాయణస్వామి సవాల్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత మామ నందమూరి తారక రామారావును దించిన చరిత్ర సీఎం చంద్రబాబుదని, అలాంటి ఆయనకు ప్రజలు ఓ లెక్కా అని ప్రశ్నించారు.
ఇప్పుడు ఎన్నికలు పెడితే 140 సీట్లు వస్తాయని పప్పు అయిన లోకేష్ అంటున్నారని.. ఇలాంటి మాటలు కట్టిపెట్టాలన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించిన టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని లోకేష్కు నారాయణస్వామి సవాల్ విసిరారు.
గత ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తేనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. భూమా అఖిలప్రియ వైయస్ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలితే నంద్యాల ప్రజలు గుణపాఠం చెబుతారని నారాయణస్వామి హెచ్చరించారు. నంద్యాల ఉప ఎన్నికలో లబ్ధిపొందడం కోసం టీడీపీ నేతలు కులాల వారిగా విభజించి చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.