రోజాను ఏవిధంగా సస్పెండ్ చేశారు, మా ఉద్దేశ్యం కాల్ మనీ: వైసిపి కొత్త అర్థం!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏ విధంగా ఏడాది పాటు సస్పెండ్ చేస్తారని వైసిపి నేత తమ్మినేని సీతారామ్ ఆదివారం నాడు ప్రశ్నించారు. ఇత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
ఏ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారని తమ్మినేని సీతారామ్ నిలదీశారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కానీ, సభాపతి కోడెల శివప్రసాద రావును కానీ దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
కామ అంటే కాల్ మనీ అనే ఉద్దేశ్యంతో రోజా వ్యాఖ్యలు చేశారని వివరించారు. ప్రభుత్వం తమ పనులను స్పీకర్ చేత చేయిస్తోందని ధ్వజమెత్తారు. స్పీకర్ ఒత్తిడి మధ్య పని చేస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ చర్చ సందర్భంగా ప్రతిపక్షం వాదనను పరిగణలోకి తీసుకోలేదన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రోజాను ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారామ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.