ఏపీ రాజధాని అమరావతిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతికి వెళ్తుంటే ఎడారికి వెళ్తున్నట్లుందన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రాజస్థాన్ ఎడారితో పోలుస్తూ..
రాజధాని అమరావతికి వెళ్లాలంటే.. రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లు ఉందన్న ఆయన.. మిగిలినవారు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్నారని అన్నారు. న్యూఢిల్లీలో తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో ఆ పరిస్థితి లేదంటూ..
‘అందరూ గర్వించేలా రాజధాని ప్రాంతం ఉండాలి. ప్రతి ఒక్కరూ రాజధానిని చూసి ఇది నాది అనే భావన వ్యక్తం చేయాలి. అమరావతిలో ఆ పరిస్థితి కనిపించలేదు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు' అని స్పీకర్ తమ్మినేని సేతారాం వ్యాఖ్యానించారు. విమర్శలు చేసేవాళ్లు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలన్నారు.
గత ప్రభుత్వానికి గుణపాఠం..
రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్లో జరిగిన అవినీతిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ సీతారామ్ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ఏమాత్రం ఆహ్లాదకరంగా జరగడం లేదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తమ్మినేని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించిన గత టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తమ తీర్పుతో గుణపాఠం చెప్పారన్నారు.
దుమారం రేపుతున్న స్పీకర్ వ్యాఖ్యలు
అసెంబ్లీలో సభ్యులు వాడుతున్న భాష విషయంలో అందరూ బాధ్యులేనని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఈ సంప్రదాయాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. కాగా, అమరావతిని ఎడారితో పోల్చుతూ తమ్మినేని సీతారం వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. రాజధాని నగరాన్ని ఎడారితో పోలుస్తారా? అంటూ మండిపడుతున్నారు. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులు గత రెండు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలించవద్దంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.