టిడిపి మూతేనా?: జెసిపై తమ్మినేని, అహంకారం వద్దని..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అహంకార పూరితంగా, అవివేకంగా మాట్లాడొద్దని జెసికి సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం కోసం ఎంతో కృషి చేసి అనుమతులు తీసుకొచ్చారని అన్నారు. ఈ విషయం జెసికి తెలియదా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం కోసం పాదయాత్ర చేస్తే.. ఆ సమయంలో మనుగడ కోసం, రాజకీయ పార్టీల కోసం జెసి పాదయాత్ర చేశారని ఆరోపించారు.
గతంలో జెసి దివాకర్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీ మూతపడిందని సీతారాం అన్నారు. ఇప్పుడు జెసి చేరడంతో తెలుగుదేశం పార్టీ మూతపడుతుందా అని ఆయన ప్రశ్నించారు.
పాలెం బస్సు ప్రమాద ఘటన తర్వాత స్వీయ రక్షణ కోసం జెసి దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.