శాసనసభలో కొత్త ట్విస్ట్: స్పందించని బాబు : సభాపతికి స్వాగతం పలకకుండా..వైసీపీకి అస్త్రం..
ఏపీ శాసనసభలో కొత్త ట్విస్ట్. శాసనసభ నూతన స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక అయినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే పార్టీల నేతలు ఆయన్ను స్పీకర్ వేదిక వద్దకు తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే సీతారాంను ఆలింగనం చేసుకొని ఆయన కుర్చీ వద్దకు తీసుకొచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత వైపు అందరూ చూసారు. అయితే, సభలోనే ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం తన సీటు నుండి కదల్లేదు. అచ్చంనాయుడు వచ్చి కొత్త స్పీకర్కు అభినందనలు తెలిపారు.
స్పీకర్గా తమ్మినేని ప్రకటన
ఏపీ శాసనసభ కొత్త స్పీకర్గా తమ్మినేని సీతారాం పేరును ప్రొటెం స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నామినేషన్ తో పాటుగా ప్రతిపాదించిన వారి పేర్లను ప్రొటెం స్పీకర్ చదివి వినిపించారు. ఆ వెంటనే స్పీకర్గా సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఆయన ప్రకటించారు. అదే సమయంలో ఆయన్ను సభలోని అన్ని పార్టీల నేతలు స్పీకర్ సీటు వద్దకు గౌరవంగా తీసుకురావాలని సూచించారు. ఆ సమయంలో వైసీపీ నేతలు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేసారు. టీడీపీ నుండి మాత్రం స్పందన రాలేదు. సీతారాం పేరు ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన సీటు నుండి సీతారాం వద్దకు వెళ్లి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. మంత్రులు..ఎమ్మెల్యేలు వెంట రాగా స్పీకర్ను జగన్ వెంట బెట్టుకొని స్పీకర్ సీటు వద్దకు తీసుకెళ్లారు.
స్పందించని చంద్రబాబు
స్పీకర్ ప్రకటన సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సభలోనే ఉన్నారు. ప్రొటెం స్పీకర్ కొత్త స్పీకర్ ప్రకటన చేయగానే..ఆయన్ను అందరు పార్టీ నేతలు గౌరవంగా సీటు వద్దకు తీసుకెళ్లాలని కోరినా..చంద్రబాబు స్పందించలేదు . టీడీపీ ఉప నేత..శ్రీకాకుళానికే చెందిన అచ్చంనాయుడు మాత్రం స్పీకర్ను కుర్చీ వద్దకు తీసుకెళ్లే సమయంలో కలిసి వచ్చారు. ఆ సమయంలోనూ చంద్రబాబు స్పందించ లేదు. ఇక, సీతారం స్పీకర్ సీట్లో ఆసీనులైన తరువాత అచ్చంనాయుడు స్పీకర్ వైపు కూడా చూడకుండానే ఆయనకు నమస్కారం చేసి వెళ్లిపోయారు. టీడీపీ నుండి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పీకర్ వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు వేదిక మీదకు వచ్చి సీతారాం కు అభినందనలు తెలిపారు.
చంద్రబాబు ఇలా చేయటం వెనుక..
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఒక బీసీ స్పీకర్ ఎన్నిక సమయంలో వ్యవహిరించిన తీరుతో ఇప్పుడు ఏపీ అధికార పక్షానికి చంద్రబాబు అస్త్రం అందించారు. స్పీకర్..బీసీ నేతను స్పీకర్గా ఎంపిక చేయటం ఇష్టం లేకనే చంద్రబాబు ఇలా వ్యవహరించారనే అభిప్రాయం వైసీపీ నేతలు వ్యక్తం చేసారు. గతంలో తమ్మినేనితో ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా చంద్రబాబు రాలేకపోయారని చెబుతున్నా..సభలో చంద్రబాబు తీరు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ముఖ్యమంత్రి తరువాత మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు కొత్త స్పీకర్కు మాత్రం అభినందనలు తెలిపారు.