నారా లోకేష్పై ప్రమాణం చేయగలరా?: ఓటుకు నోటుపై తమ్మినేని సీతారాం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంభాషణల్లో ఉన్న గొంతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని తాను దేవుడి ముందు, తన కుమారుడిపై ప్రమాణం చేస్తానని, తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు కూడా ప్రమాణం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆ గొంతు మీది కాదని మీరు లోకేష్పై ప్రమాణం చేయగలరా అని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మారగానే అక్కడ పిడుగులు పడి 20 మంది చనిపోయారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎపిలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, తక్షణమే రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్లుగా రైతు రుణమాఫీ పేరు చెప్పి రైతులకు ఒక్క రూపాయి కూడా కొత్త రుణాలు ఇవ్వలేదని ఆయన అన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సందర్భాల్లో రైతులకు చంద్రబాబు ఇస్తున్న హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఒక్కసారైనా సమీక్షించుకున్నారా అని ఆయన అడిగారు. చంద్రబాబు రుణమాఫీ చేశానని చెబుతున్నారు గానీ రైతులు గుండె మంటలతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు చాలా హామీలిచ్చారని, ప్రస్తుతానికి వాటిని వదిలేద్దామని, సమయం వచ్చినప్పుడు వాటి విషయం చూద్దామని ఆయన అన్నారు.
రుణమాఫీ పేరుతో కొత్త రుణాలు లేకుండా చేశారని, దానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా, సింగపూర్ లాంటి ఏజెన్సీ ఏదైనా బాధ్యత వహిస్తుందా అని అన్నారు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రులు గానీ, ముఖ్యమంత్రి గానీ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాంటి పరిస్థితిలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకపోతే ఏం చేస్తారని ఆయన అడిగారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం డెడ్ స్టోరేజీ కన్నా కిందకు పడిపోయిందని ఆయన చెప్పారు దాంతో అక్కడ నీళ్లిచ్చే పరిస్థితి లేదని చెప్పారు. పైనున్న కర్ణాటక దామాషా ప్రకారం నీళ్లు వదలడం లేదని విమర్సించారు.
కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు కాబట్టి ఢిల్లీ వెళ్లి రైతుల దుస్థితి గురించి, నీళ్ల సమస్య గురించి మాట్లాడారా అని అడిగారు.